IND vs SA: టీమిండియా యువ పేసర్, కశ్మీర్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ను సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయకపోవడాన్ని ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. అతన్ని టీ20 జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటన వరకు అతన్ని ఎంపిక చేసిన సెలెక్టర్లు ఉన్నపళంగా పక్కనపెట్టం తనను షాక్కు గురిచేసిందన్నాడు.
పాలలో పడ్డ ఈగలా జట్టు నుంచి తొలగించారని విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఉమ్రాన్ మాలిక్ వ్యవహారంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.

'ఉమ్రాన్ మాలిక్ గత కొన్ని నెలల వరకు భారత జట్టులోనే కొనసాగాడు. వెస్టిండీస్ పర్యటనకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత అతను ఉన్నపళంగా జట్టుకు దూరమయ్యాడు. పాలలో పడ్డ ఈగలా ఉమ్రాన్ మాలిక్ను జట్టులో నుంచి తీసేశారు. ఓ ఆటగాడిని ఇలా ట్రీట్ చేయడం ఏ మాత్రం సరికాదు.
గత మూడు నెలల వరకు టీమిండియా ప్రధాన జట్టులో ఆడిన ఆటగాడికి ఇండియా ఏ టీమ్లో కూడా చోటు దక్కకపోవడం దారుణం. నా అభిప్రాయం ప్రకారం ఇది ఘోర తప్పిదం.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్.. అత్యంత వేగంగా బౌలింగ్ చేసే భారత బౌలర్గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది జూలైలో చివరి మ్యాచ్ ఆడిన ఉమ్రాన్ మాలిక్ను సెలెక్టర్లు పూర్తిగా పక్కనపెట్టారు. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అత్యంత వేగంగా బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ను సానబెడితే అద్భుతాలు సృష్టిస్తాడని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తుంటే.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం అతనిపై ఎలాంటి ఆసక్తి కనబర్చడం లేదు.