
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడని కొనియాడిన చోప్రా.. అతని హద్దు మీరిన దూకుడే తనకు నచ్చదన్నాడు. ఇటీవల కాలంలో తన బ్యాటింగ్ అప్రోచ్ మార్చుకున్న రోహిత్ శర్మ.. వచ్చిరాగానే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనూ రోహిత్ ఇలానే విఫలమయ్యాడు. షార్ట్పిచ్ బంతికి అనవసరంగా టెంప్ట్ అయి క్యాచ్ ఇచ్చేసాడు.
విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలను అందుకొన్న తర్వాత అడపాదడపా కొన్ని మ్యాచుల్లో రాణించినప్పటికీ రోహిత్ భారీ ఇన్నింగ్స్లు ఆడటంలో విఫలమవుతూనే ఉన్నాడు. గత 18 మ్యాచుల్లో 142.76 స్ట్రైక్రేట్తో 423 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ ప్రదర్శనపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించాడు.
'రోహిత్ అద్భుత క్రికెటర్. కానీ, రోహిత్ శర్మ ప్రదర్శించే హద్దుమీరిన దూకుడు నాకు నచ్చదు. అలా నచ్చకపోవడానికి కూడా కారణం ఉంది. తన శక్తి సామర్థ్యాలను రోహిత్ చాలా తక్కువగానే అంచనా వేసుకుంటున్నాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి సిక్స్ కోసం చూస్తుండటంతో ఔట్గా వెనుదిరిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వేళ రోహిత్ కనీసం 40 బంతులు ఆడితే తప్పకుండా 75 కంటే ఎక్కువ పరుగులే చేయగలడు. దానికి గ్యారంటీ ఇస్తా. అయితే అంతసేపు బ్యాటింగ్ చేసేందుకు అవకాశాలను తీసుకోవాలి. రోహిత్ ప్రత్యేకమైన ఆటగాడు. అందుకే క్రీజ్లో నిలబడేందుకు కొంచెం సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది'' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఆసియా కప్లోనూ శుభారంభాలను సద్వినియోగం చేసుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడు. ఇలాగే కొనసాగితే వచ్చే టీ20 ప్రపంచకప్లో ప్రదర్శనపైనా ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రస్తుతం ఆసీస్తో టీ20 సిరీస్తోపాటు సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లోనూ రాణిస్తేనే రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు అవకాశం ఉంటుంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ శర్మ కాసేపు క్రీజులో గడిపేందుకు ప్రయత్నించాలన్నాడు.