భారత జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం సాధ్యం కాదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారత జట్టు ఆడకపోతే టోర్నీ నిర్వహణకు ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కే ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం పీసీబీ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. స్టేడియాలను పునరుద్దరించడంపై ఫోకస్ పెట్టింది.

భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ..?
అయితే పాకిస్థాన్లో పర్యటించేందుకు టీమిండియా ససేమిరా అంటుంది. భద్రతా కారణాలు చూపుతూ పాకిస్థాన్లో పర్యటించలేమని, హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహించాలని ఐసీసీని కోరింది. తమ మ్యాచ్లను తటస్థ వేదికైన దుబాయ్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించడం లేదు.
భారత్ తమ దేశానికి రాకపోతే వారి స్థానంలో మరో జట్టుకు అవకాశం ఇవ్వాలని పీసీబీ ఐసీసీని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీమిండియా వాదనకు ఐసీసీ కట్టుబడి ఉంటే.. ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని, న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.
అంత సీన్ లేదు..
ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే దమ్ము ఐసీసీకి లేదన్నాడు. 'ఇది ఐసీసీ టోర్నీ. ఈ మెగా టోర్నీ కోసం బ్రాడ్కాస్టర్స్ బాగా డబ్బులు ఖర్చు చేస్తారు. భారత్ ఆడుతుందని ఐసీసీ హామీ ఇవ్వకపోతే ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.
భారత్ ఆడకపోతే టోర్నీ నిర్వహణకు ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. ఆదాయం భారీగా తగ్గిపోతుంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ గత పీసీబీ అధ్యక్షుడు శత్రు దేశ భూభాగంలో అడుగుపెడుతున్నామని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భవిష్యత్లోనూ పాకిస్థాన్.. భారత్తో ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
బీసీసీఐ పవర్ ఫుల్..
క్రికెట్ బోర్డుల్లో బీసీసీఐ ఆర్థికంగా ఎంతో బంగా ఉంది. పీసీబీకి మాత్రం అలాంటి పరపతి లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. బీసీసీఐ వ్యతిరేకంగా ఏ క్రికెట్ బోర్డు నడుచుకోదు. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు. ఈ విషయం పాకిస్థాన్తో సహా అన్ని జట్లకు తెలుసు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా బీసీసీఐ.. పాక్లో పర్యటించలేదు.
భారత్ లేకుండా ఈ టోర్నీని నిర్వహించలేరు. కాబట్టి హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరుగుతుంది. భారత్ మ్యాచ్లు యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.