
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్కు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. కేవలం రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓ మ్యాచ్ విన్నర్ను తప్పుబట్టడం ఏ మాత్రం సమంజసం కాదన్నాడు. ఇలా అయితే ప్రపంచకప్ గెలిచే జట్టును నిర్మించుకోలేమని, ఆటగాళ్లలో అభద్రతా భావం ఏర్పడుతుందని హెచ్చరించాడు.
ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఒకే పరుగు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్మన్.. సెకండ్ టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో రాహుల్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి గుడువు ముగియడం, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టడంతో జట్టులో రాహుల్ చోటుకు ఎసరు వచ్చింది.
ఈ క్రమంలోనే మంగళవారం జరిగే మూడో టీ20లో రాహుల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రాహుల్కు చోప్రా అండగా నిలిచాడు. ఈ స్టార్ బ్యాట్స్మన్పై వస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా తిప్పికొట్టాడు. త్వరలోనే ఓ పెద్ద ఇన్నింగ్స్తో రాహుల్ తన సత్తా చాటుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
'రెండు మ్యాచ్ల్లో విఫలమైన మ్యాచ్ విన్నర్పై విమర్శలు గుప్పిస్తే.. మనం ప్రపంచకప్ గెలిచే జట్టును నిర్మించలేం. ఈ రోజు రాహుల్ విఫలమయ్యాడు. రేపు ఇషాన్ కిషాన్.. ఎల్లుండి రిషభ్ పంత్ రాణించలేకపోతారు. వారిపై కూడా ఇలానే విమర్శలు గుప్పిస్తే.. ఆటగాళ్లలో అభద్రతా భావం నెలకొంటుంది.'అని చోప్రా పేర్కొన్నాడు.
గతేడాది రిషభ్ పంత్ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో టీమిండియా ఫస్ట్ చాయిస్ కీపర్గా జట్టులో కొనసాగాడు. కానీ ఇటీవల పంత్ ఫామ్లోకి రావడం.. ధనాధన్ ఇన్నింగ్స్లతో అందర్ని మెప్పించడంతో రాహుల్ పాత్రపై గందరగోళం ఏర్పడింది. టాపార్డర్లో ఆడించినా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.