రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఆ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆర్సీబీ జట్టు గురించి చర్చించిన ఆకాశ్ చోప్రా.. ఆ జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాడు.
ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్లను ఆ జట్టు వదిలేసే అవకాశం ఉందన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడుతాడని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కోహ్లీ సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేకుంటే.. ఆ జట్టు మెగా వేలంలో కొత్త కెప్టెన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

ఫాఫ్ డుప్లెసిస్కు గుడ్ బై..
'ఆర్సీబీ ముందుగా రిటైన్ చేసుకునే ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరో మూడేళ్ల పాటు కోహ్లీ ఆర్సీబీలో కొనసాగాలంటే.. రిటైన్ చేసుకోవాల్సిందే. నాకు తెలిసి విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. లేదంటే ఆ జట్టు వేలంలో మరో కెప్టెన్ను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోదు. ఎందుకంటే అతని వయసు దృష్ట్యా ఫాఫ్ డుప్లెసిస్ను వదులుకోనుంది. ఒక్క ఏడాది కోసం ఏ జట్టు అయినా మూడేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టదు. ఈ క్రమంలోనే ఆర్సీబీ రిటెన్షన్ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్ ఉండడని భావిస్తున్నా. అతన్ని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మ్యాక్సీకి కూడా టాటా..
అలాగే గ్లేన్ మ్యాక్స్వెల్ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకోదు. అతనికి గుడ్బై చెప్పనుంది. అతనితో పాటు అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్లను వదిలేయనుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఆర్సీబీ తీసుకునే ఛాన్స్ ఉంది.
పేస్ ఆల్రౌండర్ అయిన అతను చుట్టూనే టీమ్ను బిల్డ్ చేయనుంది. అతను వేలంలోకి వెళ్తే సునాయసంగా రూ.14-15 కోట్లు పలుకుతాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయి.
రేసులో రజత పటీదార్..
రజత్ పటీదార్ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అతను వేలంలోకి వెళ్తే రూ. 5-6 కోట్లు సునాయసంగా పలుకుతాడు. యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్లను కూడా రిటైన్ చేసుకునేందుకు పరిశీలించవచ్చు. వీరు మినహా మిగతా ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సిన అవసరం ఆర్సీబీకి లేదు.
ముగ్గురు లేదా నలుగురిని రిటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంత కంటే ఎక్కువగా కావాలనుకుంటే రైట్ టూ మ్యాచ్ కింద తీసుకోవచ్చు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ మరోసారి ప్లే ఆఫ్స్లోనే వెనుదిరిగినా.. అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అభిమానులు తలెత్తుకునేలా సంచలన ప్రదర్శన చేసింది.
ఫస్టాఫ్ సీజన్లో 8 మ్యాచ్లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ.. సెకండాఫ్లో మాత్రం దుమ్మురేపింది. అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలై టైటిల్ గెలిచే అవకాశాలను చేజార్చుకుంది.