బ్యాటింగ్ టెక్నిక్లో లోపం ఉండటంతోనే శ్రేయస్ అయ్యర్ను భారత జట్టు నుంచి తప్పించారని మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముఖ్యంగా వైజాగ్ టెస్ట్లో అతని బ్యాటింగ్ అప్రోచ్ టీమిండియా మేనేజ్మెంట్కు ఆగ్రహం తెప్పించిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు బీసీసీఐ శనివారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
గజ్జలో గాయం, వెన్ను నొప్పితో ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే శ్రేయస్ అయ్యర్ను గాయాల పేరిట తెలివిగా తప్పించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా అయ్యర్ వేటుపై ప్రస్తావించిన శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అతను గాయంతో బాధపడుతూ ఉంటే చివరి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండేవాడు. కానీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడంటే.. అతను సెలెక్షన్కు అందుబాటులోనే ఉన్నాడు. కానీ సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. శుభ్మన్ గిల్ సైతం శ్రేయస్ అయ్యర్లానే ఇబ్బంది పడ్డాడు. కానీ అయ్యర్లా మరీ దారుణంగా విఫలమవ్వలేదు. వైజాగ్ టెస్ట్ విషయంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి వచ్చిన విమర్శలన్నీ వాస్తవమే.
ఆ మ్యాచ్లో అతను ప్రతీ షార్ట్ బాల్కు బ్యాక్ఫుట్కు వెళ్లాడు. ఇది ఏమాత్రం సరైన తీరు కాదు. ఇలా ఆడటం మొదలు పెడితే పేసర్లు తమ బంతులతో ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. శ్రేయస్ అయ్యర్ అలా ఎందుకు ఆడుతున్నాడనే విమర్శలు కూడా వస్తాయి. వన్డే ప్రపంచకప్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
వైట్ బాల్ క్రికెట్లో బాగానే ఆడుతున్నాడు. కానీ అతని బ్యాటింగ్ టెక్నిక్లో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుంటే.. ఇలాంటి ఇబ్బందులు పదే పదే ఎదురవుతూనే ఉంటాయి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక తొలి రెండు మ్యాచ్ల్లో భారత్, ఇంగ్లండ్ చెరొక మ్యాచ్ గెలిచి ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది.