న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తే చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిలీజ్ చేయాలని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్లేయర్ రిటెన్షన్ స్కీమ్ ప్రకారం ధోనీ అంటిపెట్టుకుంటే తమ బడ్జెట్లో రూ. 15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవల్సి వస్తుందని, మిగతా ఆటగాళ్లను ఎంచుకోవడంపై ప్రభావం చూపుతుందన్నాడు. అలా జరగకుండా మంచి జట్టును ఎంచుకోవాలంటే ధోనీని వేలానికి వెళ్లనిచ్చి రైట్ టూ మ్యాచ్ కార్డ్ కింద మళ్లీ తీసుకోవాలని సలహా ఇచ్చాడు.
'మెగా ఆక్షన్ ఉంటే ధోనీనీ సీఎస్కే రిలీజ్ చేయాలి. మెగా వేలంలో తీసుకున్న ఆటగాడు మూడేళ్ల పాటు జట్టుతోనే ఉండాలి. మహీ మూడేళ్లు పాటు ఆడుతాడా? అతన్ని తీసుకోవద్దనడం లేదు. అంటిపెట్టుకుంటే రూ.15 కోట్లు చెల్లించాల్సి వస్తుందంటున్నా. ఒక వేళ ధోనీ వచ్చే సీజన్ ఆడి తదుపరి సీజన్లు ఆడకుంటే మీకు రూ.15 కోట్ల డబ్బు తిరిగి వస్తుంది. కానీ అంతటి విలువ చేసే ఆటగాడు అందుబాటులో ఉండడు కదా? అదే ధోనీని వేలంలోకి పంపించి రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద తీసుకుంటే డబ్బుకు తగ్గ ఆటగాళ్లను తీసుకోవచ్చు.'అని చోప్రా సూచించాడు. తాజా సీజన్ వైఫల్యంతో సీఎస్కేకు మెగా వేలం నిర్వహించడం అవసరమని కూడా ఈ కామెంటేటర్ అభిప్రాయపడ్డాడు. జట్టు మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరిచిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా మెగా వేలానికి ఎదురు చూస్తోంది. జట్టును పునర్నిర్మించాలని భావిస్తున్న ఆ ఫ్రాంచైజీకి పూర్తిస్థాయి వేలం అత్యంత కీలకం. తదుపరి వేలంపై బీసీసీఐ తీసుకొనే నిర్ణయంపై తమ జట్టు ప్రక్షాళన ఆధారపడి ఉంటుందని లీగ్ చివరి మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనీ చెప్పడం గమనార్హం. ఒక్క చెన్నైయే కాదు..పంజాబ్, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్ జట్లు కూడా మెగా వేలంకోసం ఆసక్తిగా చూస్తున్నాయి.
మరోవైపు ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ జట్లు పూర్తిస్థాయి వేలాన్ని ఆహ్వానిస్తుండగా.. ముంబై, ఢిల్లీ యాజమాన్యాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. బీసీసీఐ కొత్త జట్టు ప్రతిపాదన కూడా మెగా వేలం ఉండవచ్చనే సంకెతాలనిస్తుంది.
విరాట్ కోహ్లీ బర్త్డేకు క్రాకర్స్ కాల్చలేదు.. ట్రోలింగ్పై ఆర్సీబీ క్లారిటీ!