
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సిరీస్ను కాదని సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ను శాసిస్తుందా? అనే సందేహం వెలిబుచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా... ఈ విషయంలో బీసీసీఐ పాత్ర లేదనుకుంటున్నానని చెప్పాడు.
'సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇలా చేయడం ద్వారా ఒక దేశ క్రికెట్ బోర్డు కన్నా క్లబ్ క్రికెట్టే గొప్పదా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదివరకే ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్.. బంగ్లాదేశ్ పర్యటన అనేది సౌతాఫ్రికా ఆటగాళ్ల నిబద్ధతకు పరీక్ష లాంటిదని వ్యాఖ్యానించాడు. అయినా, వారు ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపారు. అంటే ఐపీఎల్ ఒక దేశ క్రికెట్ బోర్డునే బెదిరించే స్థాయికి ఎదిగిందా' అని ఘాటుగా స్పందించాడు.
అయితే, ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి పాత్ర పోషించదని చోప్రా స్పష్టం చేశాడు. అలాగే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడేందుకు అనుమతిస్తే.. వారికి వచ్చే ఆదాయంలో 10 శాతం ఆ బోర్డుకు వెళ్తుందని చెప్పాడు. ఒక విధంగా బీసీసీఐ సైతం ఇలాగే వ్యవహరిస్తోందని వెల్లడించాడు. ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ సిరీసుల్లో బీసీసీఐ కూడా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిందని, కానీ, వారికి ఐపీఎల్లో పూర్తి సీజన్ ఆడేందుకు అనుమతిచ్చిందని చోప్రా వివరించాడు.
ఈ నేపథ్యంలో క్లబ్ క్రికెట్ గొప్పదా? దేశ క్రికెట్ బోర్డు గొప్పదా? అంటే.. ఈ వివాదం ఎప్పటికీ తేలదని చెప్పాడు. ఐపీఎల్ ఆడాలా ?వద్దా? అనే విషయంలో ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురాకూడదని సూచించాడు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఆటగాళ్లు ఇతర లీగులు ఆడాలా వద్దా అనే దాన్ని ఏ బోర్డూ ఆపలేదని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు.