ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమవుతుంది. డిసెంబర్ చివరి వారంలో ఈ మినీ వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తోంది. నవంబర్ 15 లోపు పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు వదిలేసే ఆటగాళ్ల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ గురించి ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. లియామ్ లివింగ్ స్టోన్, రసిఖ్ సలామ్ దార్ వదిలేస్తే జట్టు సెట్ అయిపోతుందని చెప్పాడు.

'ఆర్సీబీ లియామ్ లివింగ్ స్టోన్, రసిఖ్ సలామ్దార్ను వదిలేస్తే సరిపోతుంది. మిగతావారిలో ఎవరిని వదులుకోకూడదు. జట్టూ కూర్పు బాగున్నప్పుడు ఆటగాళ్లను వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ సారి వారు రికార్డులు బద్దలు కొట్టారు. లివింగ్స్టోన్, రసిఖ్ సలామ్దార్లను తప్పా మిగతా వారిని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. లివింగ్ స్టోన్ను చాలా ధర పెట్టి కొన్నారు. కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.
మిడిలార్డర్లో రజత్ పటీదార్కు తోడుగా మంచి బ్యాటర్ను తీసుకోవాలి. యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపెర్డ్, నువాన్ తుషార్లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. బ్యాకప్ ఇండియన్ బౌలర్ కావాలనుకుంటే రసీఖ్ను వదిలేయవచ్చు. అతను అద్భుతమైన ఆటగాడే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను రూ. 6 కోట్ల భారీ ధర పలికాడు. ఆ డబ్బును వేరే ఆటగాడిపై ఖర్చు చేయవచ్చు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మలతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లివింగ్ స్టోన్ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేయగా.. రసీఖ్ సలామ్దార్ను రూ. 6 కోట్లకు తీసుకుంది. కానీ ఈ ఇద్దరూ తీవ్రంగా నిరాశపర్చారు. ఐపీఎల్ 2025లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలి టైటిల్ను ముద్దాడింది. దాంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. కానీ ఈ విజయోత్సవం చివరకు విషాదంగా మిగిలిపోయింది. 11 మంది అమాయక అభిమానుల ప్రాణాలను తీసింది. మరోవైపు ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆ జట్టు మేనేజ్మెంట్ అమ్మాలనుకుంటుంది. జట్టుకు కొత్త మేనేజ్మెంట్ రావడం ఖాయంగా.. రిటైన్ లిస్ట్పై ఆసక్తి నెలకొంది.