ధోనీ, రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఐపీఎల్ 2021లోని ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఓ జట్టును రూపొందించాడు. తన జట్టులో స్టార్ ఆటగాళ్లు అయిన ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి కనీసం చోటు కూడా ఇవ్వలేదు. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన రోహిత్, ధోనీలకు కూడా కెప్టెన్గా అవకాశం ఇవ్వలేదు. చోప్రా తన జట్టుకు కెప్టెన్ ఎవరో కూడా ప్రకటించక పోవడం విశేషం. ఇక సిక్సులతో ఢిల్లీ మైదానాన్ని హోరెత్తించిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ సైతం చోప్రా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఓపెనర్లుగా రాహుల్, ధావన్
ఆకాశ్ చోప్రా తన జట్టుకు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్లను ఎంపిక చేసుకున్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2021లో రాహుల్ మూడు పెద్ద నాక్లు ఆడాడని, అన్నింటిలో పంజాబ్ కింగ్స్ విజయం సాదించిందన్నాడు. రాహుల్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడని ప్రశంసించాడు. సీజన్ ఆరంభం నుంచి ధావన్ పరుగుల వరద పారించాడని, ఆరెంజ్ క్యాప్ కూడా అతడి వద్దే ఉందన్నాడు. చెన్నై జట్టుకు ఓపెనర్ మంచి ఆరంభాలు ఇచ్చిన ఫాఫ్ డుప్లెసిస్ను మూడో స్థానం కోసం ఎంచుకున్నానని ఆకాశ్ తెలిపాడు.
కీపర్గా పంత్
నాలుగులో గ్లెన్ మాక్స్వెల్, ఐదులో ఏబీ డివిలియర్స్, ఆరులో రిషబ్ పంత్ను తీసుకుని ఆకాశ్ చోప్రా తన ఐపీఎల్ జట్టు మిడిలార్డర్ని బలోపేతం చేశాడు. మ్యాక్సీ క్లిష్ట సమయంలో పరుగులు చేశాడని, ఐదు మ్యాచ్లలో అతని ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఏబీ అహ్మదాబాద్లో ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమన్నాడు. ఆరులో ఎడమచేతి వాటం ఆటగాడిని పంపించాల్సిన అవసరం ఉంటుందని, అందుకే బాగా రాణించిన పంత్ను ఎంచుకున్నానని ఆకాశ్ తెలిపాడు. కీపర్గా పంత్ బాధ్యతలు నిర్వహిస్తాడని పేర్కొన్నాడు.
టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్.. మరి కెప్టెన్ ఎవరు? రేసులో అయ్యర్, ధావన్!!
అవేష్, హర్షల్లకు చోటు
ఇక ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్లను సెలెక్ట్ చేసిన ఆకాశ్ చోప్రా.. జడేజాకి జోడీగా స్పిన్నర్ రాహుల్ చహర్ని తీసుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో అవేష్ ఖాన్, హర్షల్ పటేల్కి చోటిచ్చిన చోప్రా.. క్రిస్ మోరీస్ రూపంలో మూడో పేసర్ అందుబాటులో ఉంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో స్టార్ పేసర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కాగిసో రబడలకు నిరాశే ఎదురైంది. విదేశీ కోటాలో మాక్స్వెల్, డివిలియర్స్, డుప్లెసిస్, మోరీస్లను తీసుకున్నాడు.
ఆకాశ్ చోప్రా ఐపీఎల్ జట్టు
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్, రాహుల్ చహర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.