
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక సారథి రిషభ్ పంత్ ఫామ్పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడని, టీ20ల్లో అతని పెర్ఫామెన్స్ దిగజారుతుందని చెప్పాడు. ఇలానే ఆడితే పొట్టి ఫార్మాట్లో కొనసాగడం కష్టమని హెచ్చరించాడు. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ రూపంలో జట్టులో తీవ్ర పోటీ నెలకొందని చెప్పాడు. నిలకడగా రాణిస్తేనే మూడు ఫార్మాట్లలో అవకాశాలు అందుకుంటాడని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. పంత్ బ్యాటింగ్ తీరును విశ్లేషించాడు.
'రిషభ్ పంత్ ఫామ్ ఇప్పుడు టీమిండియాకి అతి పెద్ద సవాల్. అతను మూడు మ్యాచుల్లోనూ కలిపి 40 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్లో పంత్ బాగానే ఆడాడు. చేసింది తక్కువ పరుగులే అయినా వేగంగా ఆడాడు. రిషభ్ పంత్ టీ20 పర్ఫామెన్స్ సరిగా లేకపోతే అతను పొట్టి ఫార్మాట్లో కొనసాగడం కష్టం. అతను టెస్టుల్లో క్లాస్ ప్లేయర్. టీ20ల్లో మాత్రం రిషభ్ పంత్ పర్ఫామెన్స్ దిగజారుతూనే ఉంది.
కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని జట్టుకి అందుబాటులో వస్తే రిషభ్ పంత్, టీమ్లో చోటు దక్కించుకోవడం కష్టమే. ఇషాన్ కిషన్ రూపంలో మరో వికెట్ కీపర్, టీమ్కి అందుబాటులో ఉన్నాడు. అతను నిలకడగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇలాగే కొనసాగితే రిషభ్ పంత్ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్లో 14 మ్యాచులు ఆడిన రిషభ్ పంత్, 151.78 స్ట్రైయిక్ రేటుతో 340 పరుగులు చేశాడు, ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్లో 29 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో టీ20లో 5, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు. టీ20ల్లో మొత్తంగా 46 మ్యాచుల్లో కలిపి 23.32 సగటుతో 723 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో రిషభ్ పంత్ సగటు 13.33 మాత్రమే ఉండగా, స్ట్రైయిక్ రేటు 129.03 గా ఉంది.