
న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. విదేశాల్లో కేఎల్ రాహుల్కు మెరుగైన రికార్డు ఉండటంతోనే టీమ్మేనేజ్మెంట్గా అండగా నిలుస్తుందని చెప్పాడు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు ఇన్నింగ్స్ల్లో 20, 17, 1 పరుగులే చేసాడు. ఈ పేలవ ప్రదర్శనతో రాహుల్ వైస్ కెప్టెన్సీ హోదాను కోల్పోయాడు. అయితే సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను కాదని పేలవ ఫామ్తో సతమతమవుతున్న రాహుల్ను ఆడించడం ఏంటని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అయితే ఘాటు విమర్శలు చేశాడు. ఎనిమిదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ తర్వాత 46 టెస్టుల్లో కేవలం 34 సగటుతో నమోదు చేయడమంటే సాధారణమని, గత 20 ఏళ్లలో ఇంత తక్కువ సగటుతో ఏ భారత క్రికెటర్కూ ఇన్ని అవకాశాలు దక్కలేదని వ్యాఖ్యానించాడు.
యువ ఆటగాళ్ల ప్రదర్శనలను విస్మరిస్తూ, ప్రతిభావంతులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతూ రాహుల్నే ఎందుకు ఆడిస్తున్నారని వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించాడు.
ఈ విమర్శలకు ఆకాశ్ చోప్రా కౌంటరిచ్చే ప్రయత్నం చేశాడు. రాహుల్కు అండగా నిలుస్తూ.. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో చేసిన పరుగల గణంకాలను షేర్ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే భారత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ రాహుల్కు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. రెండో టెస్ట్కు ముందు కూడా రాహుల్కు మద్దతుగా ఆకాశ్ చోప్రా మాట్లాడగా.. అతను ఏదో పదవి ఆశించి ఇలా మాట్లాడుతున్నాడన అభిమానులు విమర్శలు గుప్పించారు.
వీటికి కూడా ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. బీసీసీఐలో ఏదైనా పదవి లేదా టీమిండియా సెలెక్టర్/ కోచ్ పదవి, ఐపీఎల్ మెంటార్, కోచ్ లేదా ఐపీఎల్ టీమ్లో ఎలాంటి రోల్ తనకు అవసరం లేదని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.