టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు చేసిన తప్పిదానికి హార్దిక్ పాండ్యాను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించాడు. వార్షిక కాంట్రాక్ట్ల్లో హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ కేటాయించడాన్ని ఆకాశ్ చోప్రా సమర్థించాడు.
గత బుధవారం బీసీసీఐ భారత ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు సెంట్రాల్ కాంట్రాక్ట్లు ఇవ్వకుండా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాదికి సంబంధించిన కాంట్రాక్ట్ల కోసం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను పరిగణలోకి తీసుకోవడం లేదని బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది.

ప్రతీ ఒక్కరు దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పింది. అయితే బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబడుతూ అభిమానులు, కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 నుంచి ఎలాంటి దేశవాళీ క్రికెట్ ఆడని హార్దిక్ పాండ్యాకు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ కేటాయించి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటు వేయడం అన్యాయమన్నారు.
హార్దిక్ పాండ్యాకు ఇషాన్, శ్రేయస్ అయ్యర్లకు ఒక రూలా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి వివక్ష అంటూ ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. బీసీసీఐ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు.
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు చేసిన తప్పిదాలకు హార్దిక్ పాండ్యాను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్ ఆడలేదనే వాదన ఏ మాత్రం భావ్యం కాదన్నాడు. 'ఎలాంటి తప్పిదం చేయని హార్దిక్ పాండ్యాను శిక్షించాలని ఎందుకు కోరుకుంటున్నారు? అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడటం లేదు. అతనికి ఆ ఆలోచన, లక్ష్యం కూడా లేదు. అతను ఈ విషయం చెప్పకపోయినా చాలా సిరీస్లకు అతను అందుబాటులో లేడు.
టెస్ట్లకు అతన్ని పరిగణలోకి తీసుకోనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడమని ఎవరూ చెప్పరు. తీవ్ర గాయాలతో బాధపడుతున్నప్పుడు... రెడ్ బాల్ క్రికెట్ ఆడే సామర్థ్యం లేనప్పుడు.. చాలా ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా లేనప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడమని ఎవరు చెబుతారు.? అలాంటప్పుడు అతను ఎందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి?
అయినా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లా హార్దిక్ పాండ్యా దేశవాళీ మ్యాచ్లకు దూరంగా ఉండలేదు. అందుకే అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కింది. వన్డే ప్రపంచకప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అంటే అక్టోబర్-నవంబర్లో అతనికి గాయమైంది. అప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగిసింది.
బరోడా టీమ్ విజయ్ హజారే ట్రోఫీలో చివరి మ్యాచ్ను డిసెంబర్ 5న ఆడింది. అప్పడు హార్దిక్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడలేదనే వాదన సరికాదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.