టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ వృషణాలకు శస్త్ర చికిత్స జరగడంతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తేనే మిగతా రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేసింది.
గాయంతో దూరమైన తిలక్ వర్మ స్థానంలో ఆడే ఆటగాడిని బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. దాంతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ రేసులో ఉన్నారు. అయితే శుభ్మన్ గిల్ అవసరం జట్టుకు లేదని, మిడిలార్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు.

టీమిండియాకు మూడు, నాలుగో స్థానంలో ఆడగలిగే మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఉందని, మరో ఓపెనర్ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'భారత జట్టుకు ఓ కొత్త ఆటగాడు కావాలి. అది శుభ్మన్ గిల్? అంటే కాదు. అతని అవసరం జట్టుకు లేదు. యశస్వి జైస్వాల్ కూడా వద్దు. టీమిండియాకు మరో ఓపెనర్ అవసరం లేదు. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఆడుతాడు. నెంబర్ 3, నెంబర్ 4లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. అతను బంతితో రాణించగలిగితే ఇంకా మంచిది. కానీ మరో ఓపెనర్ అవసరమైతే లేదు.
అలాంటి ఆటగాడు ఎవరు లేకపోతే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. అతన్ని నేరుగా ఎంపిక చేయాలి. ఇప్పటికే అతను అద్భుతంగా ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ఆసియా కప్లో అవకాశం దక్కనప్పుడే ఘోర తప్పిదం జరిగిందనే అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు మిడిలార్డర్ బ్యాటర్గా ఆడించే అవకాశం ఉంది. ఓ సీనియర్ బ్యాటర్గా, ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాడిగా అయ్యర్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. నా ఓటు అయితే శ్రేయస్ అయ్యర్కే.
శ్రేయస్ అయ్యర్ వద్దనుకుంటే మాత్రం రియాన్ పరాగ్ను తీసుకోవాలి. ఎందుకంటే అతను టీమిండియా టీ20 ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అతను కొన్ని ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. ఆల్రౌండర్ కావాలనుకుంటే మాత్రం రియాన్ పరాగ్ మంచి ఆప్షన్ అవుతాడు. కానీ నా ఫస్ట్ ఛాయిస్ మాత్రం శ్రేయస్ అయ్యర్.
జితేశ్ శర్మకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే టీమిండియాకు ఓపెనర్ అవసరం లేదు. మిడిలార్డర్ బ్యాటర్ కావాలి. జితేశ్ శర్మ ఇటీవల జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ అతను వికెట్ కీపర్. జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు అవసరం లేదు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ను తీసుకోవాలని సూచిస్తున్నాను.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.