ఐపీఎల్ 2026 సీజన్లో కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే టీమిండియా తదుపరి టీ20 సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028లో టీమిండియాను నడిపించే అవకాశాన్ని కూడా అయ్యర్ అందుకోవచ్చని జోస్యం చెప్పాడు.
2028 ఒలింపిక్స్ వరకే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్గా కొనసాగుతాడని, ఆ ఈవెంట్ తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ను అన్వేషించే అవకాశం ఉందన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో జియో హాట్స్టార్ షోలో మాట్లాడిన ఆకాష్ చోప్రా.. అయ్యర్పై ప్రశంసల జల్లు కురిపించాడు.
'శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కెరీర్ ఢిల్లీ క్యాపిటల్స్తో మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ను ప్లే ఆఫ్స్ చేర్చిన అయ్యర్.. కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2021 సమయంలో అయ్యర్ గాయపడగా..రిషభ్ పంత్ను ఢిల్లీ కెప్టెన్ను చేసింది. కెప్టెన్సీపై ఉన్న ఆసక్తితో ఢిల్లీని వీడిన అయ్యర్.. ఇతర జట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. 2024లో కేకేఆర్కు టైటిల్ అందించినా.. గంభీర్ కారణంగా అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు.

విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మల స్థాయిలో భారత్ తరఫున రాణించకపోవడంతో అయ్యర్కు అంతగా గుర్తింపు దక్కలేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ మరో ట్రోఫీ గెలిస్తే.. అన్నీ ఒక్కసారిగా మారిపోయి అందరూ అతనికి చప్పట్లు కొడతారని నేను చెప్పడం లేదు. ప్రశంసలు వచ్చినా.. అతని వ్యక్తిత్వం మాత్రం రాత్రికి రాతే మారదు. తదుపరి టీ20 ప్రపంచకప్ 2028లో జరగనుంది. భారత టీ20 సారథ్యం ఇప్పుడే మారకపోవచ్చు. కానీ ఒక రెండేళ్లలో ఆ దిశగా అడుగులు పడవచ్చు.
అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్గా ఎదగాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలి. కెప్టెన్గా.. బ్యాటర్గా సత్తా చాటాలి. తన జట్టుకు టైటిల్ అందిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అతను భారత్ తరపున ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్గా కూడా మారవచ్చు. ఆ విలువ ప్రత్యేకమైనది. అప్పుడు అతనికి ఎటువంటి బయటి మద్దతు అవసరం లేదు.’అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్.. మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.