
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ 2022-23 తుది దశకు చేరుకుంది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్తో ఈ చాంపియన్షిప్కు తెరపడనుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టాప్-2లో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్.. ఈ చాంపియన్షిప్ కోసం పోటీపడనున్నాయి. అయితే ఈ చాంపియన్షిప్ ఫైనల్ను ఇంగ్లండ్లోనే ఎందుకు నిర్వహించాలనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా జూన్లోనే నిర్వహించాల్సిన అవసరం ఏం ఉందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అరంగేట్ర చాంపియన్షిప్ ఫైనల్ కూడా ఇంగ్లండ్ వేదికగానే జరగ్గా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో పరిస్థితులు న్యూజిలాండ్కు కలిసొచ్చాయి. అప్పుడు కూడా ఒక్క మ్యాచ్తో చాంపియన్ను తేల్చడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ విధానాన్ని తప్పబడుతూ టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి పలు ప్రశ్నలు సంధించాడు. ఇంగ్లండ్లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఎందుకు నిర్వహిస్తున్నారని, రెండేళ్ల పాటు సాగిన టోర్నీ విజేతను ఒక్క మ్యాచ్తో తేల్చడం ఎంతవరకు సమంజసమని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.
'డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్లో మాత్రమే ఎందుకు జరుగుతాయి. తటస్థ వేదికనే అయినా.. అక్కడ ఆసియేతర పరిస్థితులు ఉంటాయి. రెండేళ్ల పాటు సాగిన టోర్నీలో ఒక్క మ్యాచ్తోనే విజేతను ఎందుకు నిర్ణయిస్తున్నారు? వరల్డ్ టెస్ట్ చాంపియన్ను తేల్చేందుకు టెస్ట్ సిరీస్ ఎందుకు నిర్వహించడం లేదు. ఫైనల్ చేరిన జట్లలో వారి సొంతగడ్డపై చెరో మ్యాచ్తో పాటు తటస్థ వేదికగా మరో మ్యాచ్ నిర్వహిస్తే వచ్చే నష్టం ఏంటి? ఏ టోర్నీ కూడా రెండేళ్ల పాటు సాగదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను నాకౌట్ గేమ్గా నిర్వహించకండి. టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకమైన క్రీడ. ఐదు రోజుల పాటు ఆడే ఆట. టెస్ట్ చాంపియన్షిప్ రెండేళ్ల పాటు జరుగుతుంది కాబట్టి ఫైనల్ను మూడు మ్యాచ్ల సిరీస్గా నిర్వహించాలి'అని ఆకాశ్ చోప్రా డిమాండ్ చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడం సరైంది కాదని, క్రికెట్ ఫ్యాన్స్ను ఇబ్బంది పెట్టడమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాస్త సమయం తీసుకొని డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను షెడ్యూల్ చేయాల్సిందని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అన్నాడు.