టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషన్ కిషన్ కెరీర్ డేంజర్ జోన్లో పడింది. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ జార్ఖండ్ కుర్రాడు.. ఆరంభంలో భారత జట్టులోనూ నిలకడగా రాణించాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో రెగ్యూలర్ వికెట్ కీపర్గా జట్టులో కొనసాగాడు. కానీ నిలకడలేమి ప్రదర్శనతో పాటు మానసిక ఆందోళనతో ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడు.
ఇప్పుడు టీ20 ప్రపంచకప్లోనూ ఆడే అవకాశాన్ని చేజార్చుకునేలా కనిపిస్తున్నాడు. అఫ్గానిస్థాన్తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్కు ఇషాన్ కిషన్ ఎంపికవ్వలేదు. దాంతో ఇషాన్ కిషన్కు ఏమైంది? అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జట్టులో తీవ్ర పోటీ..
ప్రస్తుతం భారత జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. కేఎల్ రాహుల్ వచ్చే వరకు రెగ్యూలర్గా అవకాశాలు అందుకున్న ఇషాన్ కిషన్.. అతని రాకతో అవకాశాలను అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.
జట్టుతో కొనసాగుతున్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురైనట్లు అర్థమవుతోంది. వన్డే ప్రపంచకప్లో శుభ్మన్ గిల్ గైర్హాజరీలో అవకాశం అందుకున్న అతను.. ఆ తర్వాత బెంచ్కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో మూడు మ్యాచ్లే ఆడిన అతను.. చివరి రెండు మ్యాచ్ల్లో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వడంతో మళ్లీ చోటు కోల్పోయాడు.
సౌతాఫ్రికా పర్యటనలోనూ అవకాశాన్ని అందుకోలేదు. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్కు ఎంపికైనా బ్యాకప్ కీపర్గా ఆడే అవకాశం రాదని భావించి.. ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం వెకేషన్లో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీ కూడా ఆడటం లేదు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ భవితవ్యంపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'జట్టులో జితేశ్ శర్మ, సంజూ శాంసన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. గత రెండు సిరీస్ల్లో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేయడం లేదు. అప్పుడు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్గా ఆడాడు. కానీ ఇప్పుడు అతను జట్టులో లేడు. కారణమేంటో ఎవరికీ తెలియదు. ఓపెనింగ్ స్థానాల్లో ఖాళీ లేదు. కోహ్లీ నాలుగులో కాకుండా మూడులో ఆడుతాడు. కాబట్టి వికెట్ కీపర్ మిడిలార్డర్లో ఆడాల్సి వస్తుంది. అలాంటి ఆటగాళ్లు కాబట్టే జితేశ్, శాంసన్ జట్టులో కొనసాగుతున్నారు.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.