అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియా వేదికగా నేటి(శుక్రవారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే క్వాలిఫయర్-2 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
లీగ్ దశలో 10 విజయాలతో టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్స్కు చేరిన గుజరాత్ టైటాన్స్కు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది. క్వాలిఫయర్-1లో గుజరాత్పై గెలిచిన చెన్నై ఫైనల్ చేరింది. గుజరాత్కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే ఫైనల్లో చెన్నైతో తలపడనుంది. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది.

ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బలబలాల పరంగా రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉండటంతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖా ముఖి పోరులో ముంబైదే పై చేయిగా ఉండటం గుజరాత్ను కలవరపెడుతుంది. అయితే ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు చెరొక విజయాన్ని అందుకున్నాయి. సొంత మైదానం అయిన అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం గుజరాత్కు కలిసొచ్చే అంశం.
ముంబై ఇండియన్స్ను ఓడించాలంటే గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో కీలక మార్పు చేయాలని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ట్వీటర్ వేదికగా పలు మార్పులను సూచించాడు. క్వాలిఫయర్-1లో దారుణంగా విఫలమైన డసన్ షనకపై వేటు వేసి నిలకడగా ఆడే సాయి సుదర్శన్ తీసుకోవాలన్నాడు.
తద్వారా ఓవర్సీస్ బౌలర్ను తీసుకునే అవకాశం ఉంటుందని, యశ్ దయాల్/దర్శన్ నల్కండేలకు బదులు జోష్ లిటిల్ను తుది జట్టులోకి తీసుకోవచ్చన్నాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బౌలింగ్ చేయాలన్నాడు. అయితే భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ను ఐదుగురు బౌలర్లతో ఎదుర్కొవడం రిస్క్ అని, చివరి ఆలోచనగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలన్నాడు.
ముంబై ఇండియన్స్ కూడా క్రిస్ జోర్డాన్ను పక్కనపెట్టి రిలే మెరిడిత్ను ఆడించాలన్నాడు. హృతిక్ షోకీన్ స్థానంలో ఎలాగు కార్తీకేయ ఆడుతాడని, గత కొన్ని మ్యాచ్ల్లోలానే కామెరూన్ గ్రీన్ను టాప్లో ఆడించాలన్నాడు.