టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ క్రికెట్ ఆడటం తమకు సిగ్గు చేటని ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ అన్నాడు. ఈ ఇద్దరు టెస్ట్ ఫార్మాట్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారని కొనియాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వరుసగా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ముందుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా... ఆ తర్వాత కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అత్యంత ఫిట్గా ఉండే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెలెక్టర్ల సూచనలతోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికినట్లు వార్తలు వచ్చాయి. దాంతో కోహ్లీ, రోహిత్ లేకుండానే టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
అక్కడ ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)2025-27 ఎడిషన్కు తెరలేవనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్ వోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, విరాట్ లేకున్నా.. టీమిండియాను తక్కువ అంచనా వేయలేమని చెప్పాడు.

'గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అసాధారణ ప్రదర్శన చేశారు. ఆట పరంగా చూస్తే.. టెస్ట్ క్రికెట్లో వారు లేకపోవడం నిజంగా సిగ్గు చేటు. కానీ భారత క్రికెట్కు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. కోహ్లీ, రోహిత్ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆటగాళ్లే వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత జట్టు కఠినమైన ప్రత్యర్థే. ఎక్కడ ఆడినా గట్టి పోటీ ఇస్తారు. భారత బ్యాటర్లు ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన చేస్తారు. ఈ సిరీస్లో మాకు కఠినమైన సవాల్ ఎదురు కానుంది.
అనధికారిక టెస్ట్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓవైపు ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించగా.. మరోవైపు కేఎల్ రాహుల్ క్రీజులో నిలబడి ఆడాడు.'అని క్రిస్ వోక్స్ చెప్పుకొచ్చాడు. ఈ అనధికారిక టెస్ట్లో 20 ఓవర్లు వేసిన క్రిస్ వోక్స్(3/60) మూడు వికెట్లు తీసాడు.