
దుబాయ్: సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2020లో ఫిక్సింగ్ కలకలం రేపింది. బుకీలు సంప్రదించారనే విషయాన్ని ఓ ఆటగాడు తెలియజేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) యాంటి కరప్షన్ యూనిట్(ఏసీయూ) అప్రమత్తమైంది. ఇప్పటికే బుకీలు దుబాయ్లో తిష్టవేసారని తెలిపిన బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్.. టోర్నీ సజావుగా జరిగేందుకు మూడు టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లను కలవడం బుకీలకు తలకు మించిన పనని, అది సాధ్యం కాదన్నారు. ఇక ఓ ఆటగాడిని బుకీని సంప్రదించాడనే సమాచారంతో అప్రమత్తమయ్యామని, విచారణ జరుగుతుందన్నారు.
'ఓ ఆటగాడిని బుకీలు సంప్రదించారని, అతను మా దృష్టికి తెచ్చాడు. ఆ వ్యక్తిని ట్రాక్ చేసే పనిలో ఉన్నాం. దానికి కొంచెం సమయం పడుతుంది.'అని న్యూస్ 18తో మాట్లాడుతూ అజిత్ సింగ్ అన్నారు. యాంటి కరప్షన్ నిబంధనల ప్రకారం.. బుకీలు సంప్రదించారని సమాచారమిచ్చిన ఆటగాడి, ఫ్రాంచైజీ పేరు వెల్లడించరు. గోప్యంగా ఉంచుతారు.
మరోవైపు ఆటగాళ్లందరికి ప్రొటోకాల్స్పై అవగాహన ఉందని బీసీసీఐ పేర్కొంది. ఇప్పటికే వారంత అనేక యాంటీ కరప్షన్ క్లాస్లు విన్నారని తెలిపింది. బుకీలు సంప్రదించిన ఆటగాడు ఏదో జరుగుతుందని పసిగట్టి ఏసీయూకి సమాచారమిచ్చాడని పేర్కొంది. 'గొప్ప విషయం ఏంటటే.. బుకీ సంప్రదించిన ఆటగాడు ఏదో జరుగుతుందని వెంటనే గ్రహించాడు. అతనికి అనుమానం కలగడంతో వెంటనే ఏసీయూకి సమాచారాం ఇచ్చాడు. ప్రతి ఆటగాడికి ఆఖరికి అండర్ -19 నుంచి వచ్చిన ప్లేయర్స్కు కూడా యాంటి కరప్షన్ ప్రొటోకాల్స్ గురించి అవగాహన ఉంది'అని బీసీసీఐ పేర్కొంది.