
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తండ్రి మరణంతో భారత యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ అనుభవించిన పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. కానీ, బొరియా మజుందార్, కుషన్ సర్కార్ రాసిన 'మిషన్ డామినేషన్: యాన్ అన్ ఫినిష్డ్ క్వెస్ట్'అనే పుస్తకంలో వచ్చిన వివరణ మాత్రం కంటతడి పెట్టిస్తోంది. యూఏఈలో ఐపీఎల్ ముగించుకుని అట్నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు పిడుగులాంటి వార్త విన్నాడు.
తననెంతో కష్టపడి పెంచి, క్రికెటర్ను చేసిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందితే కొవిడ్ నిబంధనల కారణంగా స్వదేశానికి వెళ్లలేని స్థితి సిరాజ్ది. తండ్రి చనిపోతే కడసారి చూపునకు నోచుకోలేదు. పైగా ఆ బాధాకర సమయంలో తన పక్కన ఎవ్వరూ లేరు. అప్పుడు సిరాజ్ అనుభవించిన మానసిక వేదన గురించి 'మిషన్ డామినేషన్'లో బోరియా మజుందర్, కుషాన్ వివరించారు.
'నవంబరులో ఆస్ట్రేలియాలో సిరాజ్ 14 రోజుల క్వారంటైన్లో ఉన్న సమయంలో తన తండ్రిని కోల్పోయాడు. అప్పుడు ఆటగాళ్లందరూ ఎవరికి వాళ్లు ఒంటరిగా గదుల్లో గడపాల్సిన పరిస్థితి. ఆటగాళ్లు పరస్పరం కలవకుండా గదుల బయట రక్షణ సిబ్బంది ఉండేవారు. దీంతో సిరాజ్ తన బాధను పంచుకోవడానికి కూడా పక్కన ఒక్కరు లేని పరిస్థితి. వీడియో కాల్స్ ద్వారా తనను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. ఒక్క ఫిజియో నితిన్ పటేల్కు మాత్రమే ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండేది. అతనే సిరాజ్ను కాస్త ఓదార్చాడు. ఆ సమయంలో నిరాశలోకి జారుకోలేదు.
భారత జట్టు తరఫున సత్తా చాటాలన్న తన తండ్రి కలను నెరవేర్చాలనుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో వైఫల్యం అతన్ని వెంటాడుతూనే ఉంది. కానీ భారత్-ఎ తరఫున ఆస్ట్రేలియాలో పర్యటించినపుడు హెడ్, లబుషేన్లపై తాను పైచేయి సాధించిన విషయాన్ని గుర్తు చేసుకుని.. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఆ ఇద్దరినీ ఎందుకు ఔట్ చేయలేనని తనను తాను ప్రశ్నించుకున్నాడు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడే అవకాశం రాగానే చెలరేగాడు. మొత్తం 13 వికెట్లతో సిరీస్లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్గా నిలిచాడు'' అని ఈ పుస్తకంలో సిరాజ్ ప్రయాణాన్ని వివరించారు.
ఇక సిరాజ్ పడిన కష్టం తెలిసిన టీమ్మేట్స్.. సిరీస్ విక్టరీ సాధించిన రోజు హైదరాబాదీకి త్రివర్ణపతాకం కప్పి తమ గౌరవాన్ని చాటుకున్నారు. వికెట్ తీసినప్పుడల్లా సిరాజ్తో కలిసి పైకి వేలు చూపిస్తూ అతని తండ్రికి నివాళులర్పించారు. ఆ జోరును ఇంగ్లండ్ పర్యటనలోను కొసాగిస్తున్న సిరాజ్.. లార్డ్స్ టెస్ట్లో 8 వికెట్లతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.