
డై హార్డ్ ఫ్యాన్..
'ధోనీని కలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తాను'అని అజయ్ గిల్ టెలిగ్రాఫ్ ఇండియాకు తెలిపాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తనకు అభిమాన క్రికెటరైన మహీతో 10 నిమిషాలు మాట్లాడిస్తే చాలని వేడుకున్నాడు. అయితే అజయ్ గిల్ జార్ఖండ్ వచ్చే సమయానికి మహీ ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం చెన్నై నుంచి దుబాయ్కు బయల్దేరాడు. మూడు నెలల తర్వాత ధోనీ భారత్కు వస్తాడని చెప్పినా తన ఆరాధ్య దైవాన్ని కలవకుండా ఇంటికి వెళ్లే పరిస్థితే లేదని మొండి పట్టుపడుతున్నాడు. తన సొంత గ్రామంలో బార్బర్గా పనిచేసే అజయ్.. తన విభిన్నమైన కటింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించేవాడు. తన హెయిర్కు ఎల్లో, ఆరేంజ్, డార్క్ బ్లూ, కలర్స్ వేసుకున్న అతను ఓ పక్క ధోనీ, మరో పక్క మహీ అని వెంట్రుకలపై రాసుకున్నాడు. ధోనీ కోసం పాదయాత్ర చేస్తున్నానని తెలుసుకున్న తన సహచర బార్బర్ ఫ్రీగా ఈ కటింగ్ చేశాడని తెలిపాడు.

ఆశీర్వాదం కోసం..
ధోనీని కలసుకోవడానికి గల కారణం ఏందని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఒకప్పుడు క్రికెటర్ కావాలనుకున్నానని, కానీ ధోనీ రిటైర్మంట్ తర్వాత కోపంతో ఆడటం మానేశానన్నాడు. ధోనీ ఆశీర్వాదం తీసుకొని మళ్లీ ఫ్రెష్గా ఆడటం మొదలుపెట్టాలనుకుంటున్నట్లు 18 ఏళ్ల అజయ్ గిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇతని గురించి తెలుసుకున్న అనురాజ్ చావ్లా అనే స్థానికుడు, అతని స్నేహితులు అజయ్ గిల్కు హోటల్ గది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నచ్చజెప్పి ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి పంపించారు.

ఏడాది క్రితమే..
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు(ఆగస్టు 15, 2020) భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. స్వాతంత్ర్యదినోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్న యావత్ దేశానికి ఊహించని నిర్ణయంతో షాకిచ్చాడు. ఇన్స్టా వేదికగా 'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ చిన్న వీడియోను షేర్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు మహీ దూరమై ఏడాదవుతున్నా అతని పేరు మాత్రం మారుమోగుతూనే ఉంది.

ఐపీఎల్కు రెడీ..
మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా.. ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. కరోనాతో ఆగిపోయిన రెండో దశ లీగ్కు సిద్ధమయ్యాడు. IPL 2021 రెండో దశ సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ జరగనుంది. మెగా టోర్నీ ఆరంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో అప్పుడే సందడి మొదలైంది. ధోనీతో పాటు మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా, యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఇప్పటికే దుబాయ్కు చేరుకున్నారు. ఐపీఎల్ 2021 సీజన్లో ఏడు మ్యాచ్లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్ల్లోనైనా మహీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications
