ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ యువ ప్లేయర్ను మందలించాననే అక్కసుతో తనను టీమ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారి ఆరోపించాడు. సుదీర్ఘ కాలం జట్టుకు ఆడటంతో పాటు సక్సెస్ఫుల్గా టీమ్ నడిపిన తన కంటే ఓ కుర్రాడికి ప్రాధాన్యత ఇవ్వడం తనకు అవమానంగా ఉందని, భవిష్యత్తులో మళ్లీ ఆంధ్ర జట్టుకు ఆడానని హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
హనుమ విహారి ఆరోపణలను ఖండిస్తూ సదరు యువ ప్లేయర్ స్పందించాడు. ఆంధ్ర టీమ్ బ్యాకప్ వికెట్ కీపర్ కేఎన్ పృథ్వీ రాజ్ ఘాటుగా బదులిచ్చాడు. హనుమ విహారి ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ రోజు ఏం జరిగిందో జట్టు మొత్తానికి తెలుసని, సానుభూతి గేమ్స్ ఆడుకో అంటూ విమర్శలు గుప్పించాడు.

ఈ పోస్ట్పై హనుమ విహారి స్పందించాడు. తనను కెప్టెన్గా తొలగించవద్దంటూ జట్టులోని ఆటగాళ్లంతా అసోసియేషన్కు రాసిన లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ లేఖలో హనుమ విహారినే కెప్టెన్గా కొనసాగించాలని, ఆయన ఎవర్నీ కూడా వ్యక్తిగతంగా దూషించలేదని జట్టులోని ఆటగాళ్లంతా పేర్కొన్నారు.
కేఎన్ పృథ్వీ రాజ్ తండ్రి అధికారిక పార్టీకి చెందిన కార్పోరేటర్గా తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఓ కీలక నేత ప్రధాన అనచరుడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, సదరు కార్పోరేటర్ కానీ స్పందించలేదు. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నాయకుల జోక్యం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితులన్నీ చక్కదిద్దాలని, రాజకీయాలకు దూరంగా అసోసియేషన్ను నడిపించాలని కోరుతున్నారు. ఓ కార్పోరేటర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయాలు శాసించడం ఏంటని మండిపడుతున్నారు. రాజకీయ అండదండలతోనే పృథ్వీ రాజ్ ఆంధ్ర జట్టుకు ఎంపికయ్యాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.