రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్సీబీపై ఉన్న అభిమానంతో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తమను కలిచివేస్తుందని పోస్ట్లు పెడుతున్నారు. కొందరైతే..ఆర్సీబీ టైటిల్ గెలవకపోయినా బాగుండేదని, పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిస్తే ఆ 11 మంది ప్రాణాలతో ఉండేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్సీబీ సంబరం.. అభిమానుల మరణం'అనే అర్థం వచ్చేలా క్రియేట్ చేసిన ఓ ఏఐ ఫొటో నెటిజన్లను కలచి వేస్తోంది. ఆర్సీబీ బస్ పరేడ్ ముందు 11 మంది శవాలు ఉన్నట్లుగా రూపొందించిన ఈ పిక్ కన్నీళ్లు తెపిస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈ విజయంతో 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఆర్సీబీ విజయాన్ని దేశవ్యాప్తంగా అభిమానులు సెలెబ్రేట్ చేసుకున్నారు. బెంగళూరులో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.

తమ అభిమాన జట్టును చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలిరావడంతో బెంగళూరు ఎరుపెక్కింది. కానీ భద్రతా లోపం.. ఫ్రాంచైజీ నిర్లక్ష్యం కారణంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆర్సీబీ ఓడినా బాగుండేదని ఆ జట్టు అభిమానులే పోస్ట్లు పెడుతున్నారు. పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచి ఉంటే ఆర్సీబీ అభిమానులు రెండు రోజులు బాధపడి మర్చిపోయేవారని, కానీ ఈ విజయం 11 మంది కుటంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటంబాలకు కోటి రూపాయలను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అభిమానుల ప్రేమతో కోట్లు సంపాదిస్తున్నప్పుడు.. వారికి జరిగిన నష్టాన్ని కూడా కోట్లతోనే పూడ్చే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబాలకు ఎంత ఇచ్చిన తక్కువేనని, కానీ వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.