టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం(జూలై 7) 43వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ధోనీ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, టీమిండియా మాజీ, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ధోనీకి బర్త్డే విషెస్ తెలియజేశారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ప్రపంచకప్ 2024ను ముద్దాడిన రోహిత్ సేన.. తొలి టైటిల్ గెలిచిన ధోనీకి తమ విజయాన్ని బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది.
ఇక ధోనీ శిష్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్.. తన గురువుకు అదిరిపోయే బర్త్డే బహుమతి ఇచ్చాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్.. ఆదివారం జరిగిన రెండో టీ20లో 77 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శనివారం జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమైన రుతురాజ్ గైక్వాడ్.. తన గురువు బర్త్డే రోజు మాత్రం 77 పరుగులతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

కాకతాళీయమో ఏమో కానీ సరిగ్గా ధోనీ బర్త్డే జూలై 7నే రుతురాజ్ గైక్వాడ్ 77 పరుగులతో సత్తా చాటాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. రుతు-తాల మధ్య బంధం ఇదేనని పేర్కొంది. భారత ఇన్నింగ్స్ అనంతరం ఈ విషయాన్ని రుతురాజ్ గైక్వాడ్ ముందు ప్రస్తావించగా.. చిరునవ్వుతో బదులిచ్చాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైందని చెప్పాడు.
'ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. 15 బంతుల వరకు నేను సరైన షాట్ ఆడలేదు. ఇందులో ఒక్క బంతిని కూడా మిడిల్ చేయలేకపోయాను. బ్యాటింగ్కు పిచ్ చాలా కఠినంగా అనిపించింది. దాంతో నేను, అభిషేక్ క్రీజులో సెట్ అయ్యే మరకు టైమ్ తీసుకోవాలని భావించాం. ఆ తర్వాతే షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాం. మా వ్యూహం పనిచేసింది. స్పిన్నర్లను అతను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మా షాట్స్ గురించి మేం తరుచూ మాట్లాడుకున్నాం.
పిచ్ కాస్త భిన్నంగా ఉంది. కొన్ని బాల్స్ స్కిడ్ అవుతుంటే.. మరికొన్ని ఆగుతూ వచ్చాయి. మేం పిచ్కు తగ్గట్లు హార్డ్ లెంగ్త్, గుడ్ లెంగ్త్, టెస్ట్ మ్యాచ్ లెంగ్త్లో బౌలింగ్ చేయాలి.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.