సౌతాఫ్రికా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించాడు. 120 ఏళ్ల టెస్ట్ రికార్డ్ను అందుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్న మార్కో జాన్సెన్.. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. దాంతో పర్యాటక శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ ధర ఇచ్చిన ఉత్సాహమో ఏమో కానీ మార్కో జాన్సెన్ ఈ మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. తన పేస్, బౌన్స్తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 35 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో 120 ఏళ్ల టెస్ట్ రికార్డ్ను సమం చేశాడు. 1904లో ఆస్ట్రేలియా బౌలర్ హ్యూజ్ ట్రంబల్ 35 బంతుల్లో 7 వికెట్లు తీసాడు. ఇన్నాళ్లకు మార్కో జాన్సెన్ మళ్లీ ఈ ఫీట్ సాధించాడు.

డర్బన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా(117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24) పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో(3/44), లాహిరు కుమారా(3/70) మూడేసి వికెట్లు తీయగా.. విశ్వా ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 13.5 ఓవర్లలో 42 పరుగులకు కుప్పకూలింది. కామిందు మెండిస్(13), లాహిరు కుమార(10 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. మార్కో జాన్సెన్(7/13) ఏడు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ(2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది.