ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా హోమ్ టెస్ట్ సీజన్ 2025-26ను ప్రారంభించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2027లో భాగంగా సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా మొదలుపెట్టింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా మొదలైన తొలి మ్యాచ్లో టాస్ ఓడి బౌలింగ్కు దిగిన భారత్కు పేసర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరగడంతో వెస్టిండీస్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని రకాల భారత క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దాంతో ఈ ముగ్గురు లేకుండానే సొంతగడ్డపై టీమిండియా బరిలోకి దిగింది. గత 15 ఏళ్లలో కోహ్లీ, రోహిత్, అశ్విన్ లేకుండా టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి.
కోహ్లీ, అశ్విన్ 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా.. రోహిత్ 2013లో రెడ్ బాల్ క్రికెట్ మొదలుపెట్టాడు. టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించేవరకు సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు.

2013 నుంచి ఈ ముగ్గురు లేకుండా సొంతగడ్డపై టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడిందే లేదు. ఈ ముగ్గురు లేకుండా టీమిండియా 2010 నవంబర్లో న్యూజిలాండ్తో నాగ్పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడింది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2010 నవంబర్ 20న(5,430 రోజుల క్రితం) ఈ మ్యాచ్ ప్రారంభమైంది.
అప్పటి జట్టులో ఇషాంత్ శర్మ ఒక్కడే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆ మ్యాచ్లో 78 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రజ్ఞాన్ ఓజా ప్రస్తుతం సెలెక్టర్గా ఎంపికయ్యాడు.