
1.టాస్ గెలవడం..
భారత్ టాస్ గెలవడం విజయానికి ప్రధాన కారణమైంది. టాస్కు ప్రాముఖ్యత ఇవ్వమని ఇరు జట్ల కెప్టెన్లు ప్రగల్భాలు పలికినా.. ముందుగా బౌలింగ్ చేయడం అడ్వాంటేజ్గా మారింది. పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బౌలర్లు చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేంజరస్ బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్లను ఔటవ్వడం ఆ జట్టు భారీ స్కోర్ అవకాశాలను అడ్డుకుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఇతర బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వడం ధాటిగా ఆడాలనే ఉద్దేశంతో వికెట్లు పారేసుకోవడం జరిగింది.

2. భువీ అసాధారణ బౌలింగ్..
ఈ మ్యాచ్లో భువనేశ్వర్(4/26) అసాధారణ బౌలింగ్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బాబర్ ఆజామ్ను ఔట్ చేసిన అతను 17వ ఓవర్లో ఆసిఫ్ అలీ(7), 19వ ఓవర్లో షాదాబ్ ఖాన్(0), నసీమ్ షాలను వరుస బంతుల్లో ఔట్ చేయడం టీమిండియాకు కలిసొచ్చింది. ముఖ్యంగా పవర్ ప్లేలో బ్యాటర్లపై అతను చెలాయించిన ఆధిపత్యం జట్టుకు శుభారంభాన్ని ఇచ్చింది. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో పాక్ స్వల్ప స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది.

3. కోహ్లీ, జడేజా సూపర్ బ్యాటింగ్..
సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరోసారి పాక్పై తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. అయితే ఆరంభంలో అతను ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేయడం పాక్ కొంపముంచింది. ఆ క్యాచ్ పట్టుంటే టీమిండియా మరింత ఒత్తిడికి లోనయ్యేది. కానీ ఈ అవకాశాన్ని అందుకున్న విరాట్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. జట్టు ఇన్నింగ్స్కు సరైన పునాదిని అందించాడు. ఇక పాక్ లెగ్ స్పిన్నర్ షాబాజ్ను ఎదుర్కొనేందుకు జడేజాను అప్ది ఆర్డర్కు పంపిస్తూ టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించింది. అతని రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల పాక్ బౌలర్లు లైన్ తప్పారు. జడేజా సైతం విలువైన పరుగులు చేశాడు.

4. హార్దిక్ ఆల్రౌండ్ షో..
ముందుగా బంతితో చెలరేగిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత బ్యాట్తో రాణించి మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడినో క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. బౌలింగ్లో కీలక మూడు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన హార్దిక్.. బ్యాటింగ్లో కడవరకు నిల్చొని 33 పరుగులతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ధోనీ తరహాలో సిక్సర్తో మ్యాచ్ను ముగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసిన హార్దిక్.. తన అనుభవంతో మ్యాచ్ను ముగించి అసలు సిసలు ఫినిషర్ అనిపించుకున్నాడు.

5. పాక్ కొంపముంచిన స్లో ఓవర్ రేట్
స్లో ఓవర్ రేట్ పాకిస్థాన్ కొంపముంచింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం నిర్నీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. చివర్లో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. ఈ మ్యాచ్లో పాక్ స్లో ఓవర్ రేట్కు కారణమై మూల్యం చెల్లించుకుంది. సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండటంతో భారత బ్యాటర్లు ధాటిగా ఆడటానికి ఆస్కారం లభించింది. హారిస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ మూడు బౌండరీలు బాదడానికి ఈ ఫీల్డింగ్ నిబంధనలే కారణం.


Click it and Unblock the Notifications
