
చెత్త కెప్టెన్సీ.. పేలవ బ్యాటింగ్
టీమిండియా పరాజయానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనే అని చెప్పాలి. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలందించిన రోహిత్.. కీలక నాకౌట్ సమరానికి మాత్రం జట్టును సంసిద్దం చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తగ్గ ప్రణాళికలు రచించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా అడిలైడ్ పిచ్ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమయ్యాడు. టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని రోహిత్ చెప్పాడు. కానీ బట్లర్ మాత్రం పిచ్కు తగ్గట్లు బౌలింగ్ ఎంచుకొని ఫలితం రాబట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. ఇక మైదానానికి తగ్గట్లు తుది జట్టును ఎంచుకోలేకపోయాడు. వ్యక్తిగతంగా కూడా రోహిత్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. టోర్నీ మొత్తంలో ఒక్క హాఫ్ సెంచరీ మినహా.. పెద్దగా రాణించింది లేదు. కీలక మ్యాచ్లో బాబర్ ఆజామ్, జోస్ బట్లర్ రాణించినట్లు రోహిత్ చెలరేగి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఓపెనర్ల వైఫల్యం..
ఈ టోర్నీ మొత్తం టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ విఫలమయ్యారు. ఒక్క మ్యాచ్లో కూడా సరైన ఆరంభాన్ని అందించలేకపోయారు. కనీసం పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేయలేకపోయారు. సూర్య, కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో వీరి వైఫల్యం పెద్దగా కనిపించలేదు. ఇక కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్ల్లో రాణించినా.. కీలక సెమీస్లో ఔటవ్వడం.. భారత బ్యాటింగ్పై ప్రభావం చూపింది. దూకుడుగా ఆడకుండా చేసింది. రోహిత్ శర్మ 28 బంతులాడి 27 పరుగులు చేయడం కూడా టీమిండియా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ తరహాలో సరైన ఆరంభాన్ని అందిస్తే టీమిండియా భారీ స్కోర్ చేసేది.

ధాటిగా ఆడకపోవడం...
ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో టీమిండియా పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయింది. విరాట్, రోహిత్ ధాటిగా ఆడకుండా నిదానంగా ఆడారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులే చేసింది. ఆ తర్వాత కూడా పరుగులు చేయడంలో ఈ జోడీ ఇబ్బంది పడింది. ముఖ్యంగా రోహిత్ జిడ్డు బ్యాటింగ్తో జట్టుకు తీవ్ర నష్టం కలిగించాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. విరాట్, హార్దిక్ సైతం నిదానంగా ఆడారు. 13వ ఓవర్ నుంచి గేర్ మార్చినా.. చివర్లో హార్దిక్ దంచికొట్టినా సరిపోలేదు. ఇంగ్లండ్ తరహాలో దూకుడుగా ఆడి 200 పరుగుల లక్ష్యం నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

పేలవ బౌలింగ్..
టోర్నీకి ముందే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరమవ్వడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈసారి టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవలేదని చెప్పారు. బ్యాటర్లు మ్యాచ్లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారని వ్యాఖ్యానించాడు. అతను చెప్పినట్లే సూర్య, కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో సెమీఫైనల్ చేరినా.. పేలవ బౌలింగ్తో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం నిజంగా బౌలర్ల వైఫల్యమే. కనీసం ఓపెనర్లను కూడా ఔట్ చేయకపోవడం టీమిండియా బౌలింగ్ బలహీనతను తెలియజేస్తోంది. పరుగులు ఇవ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేసుంటే ఇంగ్లండ్ ఒత్తిడికి గురయ్యేది. కానీ ఒక్కరు కూడా వికెట్ తీయకపోవడం.. మ్యాచ్ను ఏకపక్షం చేసింది.

చెత్త ఫీల్డింగ్..
పేలవ బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచికొడుతుండటంతో ఫీల్డర్లు కూడా చేతులెత్తేసారు. ఆరంభంలోనే అక్షర్ పటేల్ బౌలింగ్లో జోస్ బట్లర్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను హార్దిక్ అందుకోలేకపోయాడు. రోహిత్ ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేకపోవడం.. ఇంగ్లండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. ప్రతీ ఓవర్లో బౌండరీ రాబట్టిన ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ.. తొలి బంతి నుంచి భారత్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆ క్రమంలోనే చివర్లో వచ్చిన సునాయస క్యాచ్ను కూడా సూర్య అందుకోలేకపోయాడు. బౌండరీ అద్భుతంగా ఆపిన షమీ.. బంతి దూరంగా విసిరేసి మరో 2 పరుగులిచ్చాడు.


Click it and Unblock the Notifications
