
శార్దూల్ బ్యాటింగ్:
నాలుగో టెస్టులో మ్యాచ్ భారత్ గెలవడానికి ప్రధాన కారణం ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. తొలి ఇన్నింగ్స్లో ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఓ సమయంలో 100 పరుగుల లోపే భారత్ ఆలౌట్ అవుతుందని అందరూ భావించినా.. ఠాకూర్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా 191 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైన చోట శార్దూల్ ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా ఠాకూర్ (60 బంతుల్లో 72; 7 ఫోర్లు, 1 సిక్సర్) మళ్లీ అర్ధ శతకం బాదాడు. దాంతో ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగింది భారత్. శార్దూల్ బ్యాటింగ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
IND vs ENG: విజృంభించిన భారత బౌలర్లు.. నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం! 50 ఏళ్ల నిరీక్షణకు తెర!!

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ:
నాలుగో టెస్టులో మ్యాచులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అందరిని ఆకట్టుకుంది. లార్డ్స్ టెస్ట్ మాదిరి గొడవలు, కవ్వింపులకు పోకుండా తనపని తాను చేసుకుపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్, బౌలింగ్ మార్పులు చేసి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నాడు. అజింక్య రహానే. రిషబ్ పంత్ కంటే రవీంద్ర జడేజాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు తీసుకొచ్చాడు. కుడి-ఎడమ కూర్పు కోసమే అతడిని ముందుగా పంపించాడు. ఇది ఫలితాన్ని ఇచ్చింది. కీలక సమయంలో ఉమేష్ యాదవ్కు బంతిని అందించడం, జస్ప్రీత్ బుమ్రాకు కొత్త బంతిని ఇవ్వడం కోహ్లీ చేశాడు. వికెట్ అవసరం అనుకున్న సమయంలో జడేజాకు బంతి ఇచ్చాడు. ఆటగాళ్లతో తరచూ మాట్లాడుతూ వారిలో ఆత్మ విశ్వాసం, స్ఫూర్తి నింపాడు. ఇవ్వని భారత్ విజయానికి కారణమనే చెప్పాలి.

రోహిత్ సెంచరీ:
తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ రోహిత్ శర్మ (11) విఫలమయినా.. రెండో ఇన్నింగ్స్లో (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ పరుగులు చేయడం జట్టుకు కలిసొచ్చింది. కేఎల్ రాహుల్ (46)తో కలిసి తొలి వికెట్కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించాడు. అనంతరం చేతేశ్వర్ పుజారాతో కలిసి మరో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేశాడు. ఇంగ్లండ్ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్తో రోహిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోహిత్ సెంచరీ చేయడమే మ్యాచును కాపాడింది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడానికి కారణం రోహిత్ శర్మనే.

బుమ్రా యార్కర్లు:
నాలుగో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా తీసింది నాలుగు వికెట్లే అయినా.. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన పదునైన యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్లో కీలకమైన సమయంలో ఓలి పోప్, జానీ బెయిర్స్టోలను ఔట్ చేశాడు. ఇద్దరికీ అద్భుత యార్కర్లు సందించడంతో బోల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో కూడా ఓపెనర్లను పరుగులు చేయనీయలేదు. ఓ మంచి యార్కర్ సాయంతో బర్న్స్ ను బోల్డ్ చేశాడు. మ్యాచ్ ఆసాంతం కూడా యార్కర్లు సంధించి ఇంగ్లండ్ బ్యాట్స్మన్పై ఒత్తిడితెచ్చాడు. దాంతో సహచరులు వికెట్లు తీసేందుకు అవకాశం దక్కింది. మొత్తానికి యార్కర్ కింగ్ అని మరోసారి రుజువుచేసుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్:
నాలుగో టెస్టులో భారత్ గెలవడానికి ఇంకో ప్రధాన కారణం రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన చేసిన అద్భుత బ్యాటింగే. ఓపెనర్లు మొదలుకొని టెయిలెండర్ల వరకు సత్తాచాటారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్లలో రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. చేతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ బాదాడు. లోకేష్ రాహల్ విలువైన రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ అడగా.. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. బౌలర్లు ఠాకూర్ అర్ధ శతకం బాదగా.. బుమ్రా, ఉమేష్ కూడా పరుగులు చేశారు. దాంతోనే భారత్ ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగింది. రెండో ఇన్నింగ్స్లోని బ్యాటింగే హైలట్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications












