
బ్రేక్ ఇచ్చిన శార్దూల్:
సోమవారం 77/0 ఓవర్ నైట్ స్కోర్తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్కు ఓపెనర్లు హసీబ్ హమీద్, రోరీ బర్న్స్ మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్కు 100 పరుగులు జోడించారు. అప్పటికే బర్న్స్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అర్ధ శతకం సాధించి జోరుమీదున్నాడు. అయితే మరుసటి బంతికే అతడు కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హమీద్ 55 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 48వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హమీద్.. మొహ్మద్ సిరాజ్కి క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ దాన్ని నేలపాలు చేయడంతో అద్భుత అవకాశం చేజారింది. ఇక క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న హిట్టర్ డేవిడ్ మలన్ (5) త్వరగానే రన్ ఔటయ్యాడు. జడేజా వేసిన 53వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తూ మలన్ రన్ ఔట్ అయ్యాడు.

స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు:
మలన్ అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ నిలకడగా ఆడాడు. దాంతో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. లంచ్ తర్వాత ఇంగ్లీష్ జట్టు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిలకడగా ఆడుతున్న హమీద్ (63)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్ (2) వికెట్ను కూడా చేజార్చుకుంది. పోప్ను బుమ్రా బోల్డ్ చేశాడు. అదే స్కోర్ వద్ద జానీ బెయిర్స్టోను సైతం బౌల్డ్ చేసిన బుమ్రా ఇంగ్లండ్ ఓటమికి పునాది వేశాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదింది. అయితే రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ డకౌట్గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్లో సబ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
మెరిసిన ఉమేశ్:
ఈ సమయంలో క్రిస్ వోక్స్ (18)తో కలిసి జో రూట్ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన ఓ చక్కటి డెలివరీకి అతడి వద్ద సమాధానం లేకపోయింది. బంతి వికెట్లను ఎగురవేయడంతో 182 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే మరో 11 పరుగుల తర్వాత ఉమేశ్ యాదవ్.. వోక్స్ను బోల్తా కొట్టించాడు. వోక్స్ వికెట్ అనంతరం అంపైర్లు టీ విరామం ప్రకటించారు. అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖాయం అయింది. ఇక చివరి సెషన్ ప్రారంభమైన పది నిమిషాలకే రూట్ సేన చివరి రెండు వికెట్లు (క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ అండర్సన్) కోల్పోయి ఓటమిపాలైంది. ఓలి రాబిన్సన్ నాటౌట్గా ఉన్నాడు. 368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌట్ అయింది.
50 ఏళ్ల నిరీక్షణకు తెర:
ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది. కాగా రెండో ఇన్నింగ్స్లో భారత్ తరఫున శతకం సాధించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఐదవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10 నుంచి ఆరంభం కానుంది.
స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్; శార్దూల్ (57), కోహ్లీ (50); వోక్స్ 4 వికెట్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్; పోప్ (81), వోక్స్ (50); ఉమేశ్ 3 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 ఆలౌట్; రోహిత్ (127), పుజారా (61); వోక్స్ 3 వికెట్లు
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్; హమీద్ (63), బర్న్స్ (50); ఉమేశ్ 3 వికెట్లు


Click it and Unblock the Notifications












