ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ రన్నరప్గా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్లో ఓడినా.. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 19 పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది.
11 ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు టేబుల్ టాపర్గా నిలవడం, ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ.. రికీ పాంటింగ్ కోచింగ్.. కుర్రాళ్ల ఫియర్లెస్ గేమ్.. పంజాబ్కు విజయాలను అందించాయి. టేబుల్ టాపర్గా నిలిచిన ఆర్సీబీ జట్టు కొన్నిలోపాలు ఉన్నాయి. వాటిని పంజాబ్ సరిదిద్దుకునే ప్రయత్నం చేయనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ ఐదుగురు ఆటగాళ్లను వదిలేయనుంది.

1. గ్లేన్ మ్యాక్స్వెల్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో గ్లేన్ మ్యాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ రూ. 4.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 7 మ్యాచ్లు ఆడి 8 సగటుతో 48 పరుగులే చేసి తుది జట్టులో చోటు కోల్పోయాడు. బౌలింగ్లో 13 ఓవర్లు వేసి 8.46 ఎకానమీతో 4 వికెట్లు తీసాడు. బెంచ్పై ఖాళీగా కూర్చోలేక గాయం సాకుగా చూపించి సీజన్ మధ్యలోనే వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్కు భారంగా మారిన మ్యాక్స్వెల్ను వదిలేసి అతని స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ను ఆర్సీబీ తీసుకునే ఛాన్స్ ఉంది.
2. గ్జెవియర్ బార్ట్లెట్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన గ్జెవియర్ బార్ట్లెట్ను పంజాబ్ కింగ్ రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. అతను 4 మ్యాచ్లు ఆడి 9.60 ఎకానమీతో 2 వికెట్లు మాత్రమే తీసాడు. మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి ఐపీఎల్ 2026 మినీ వేలంలో మరో పేసర్ను పంజాబ్ కింగ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది.
3. యశ్ ఠాకూర్
భారత అనామక బౌలర్ యశ్ ఠాకూర్ను రూ. 1.60 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. అతను రెండు మ్యాచ్లు ఆడి 12.15 ఎకానమీతో ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. అతను పంజాబ్ కింగ్స్ ప్లెయింగ్ ఎలెవన్ కాంబినేషన్లో సెట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో పేసర్ను వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
4. మిచెల్ ఓవెన్
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్.. ఒకే ఒక్క మ్యాచ్లు అవకాశం కల్పించింది. కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత పూర్తిగా పక్కనపెట్టేసంది. పంజాబ్కు మిచెల్ ఓవెన్ సేవలు అవసరం లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఆటగాడిని తీసుకునే ఛాన్స్ ఉంది.
5. లాకీ ఫెర్గూసన్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో లాకీ ఫెర్గూసన్ను పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 4 మ్యాచ్లు ఆడి 9.18 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత అతను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. లాకీ ఫెర్గూసన్ మెరుగైన ప్రదర్శన చేసినా.. ఫిట్నెస్ సమస్యలతో అతన్ని వదిలేయాని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.