
భువనేశ్వర్ కుమార్
టీమిండియా ప్రధాన పేసర్గా వెలుగొందుతున్న భువనేశ్వర్ కుమార్ 2009, 2010 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2009లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ఆడిన భువీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, పూణె వారియర్స్ తరుపున 2011లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది 2012లో భారత్ తరుపున అరంగేట్రం చేశాడు. కాగా, ఐపీఎల్లో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన పేసర్గా కొనసాగుతున్నాడు.

మనీష్ పాండే
ఐపీఎల్ టోర్నీలో తొలి సెంచరీ సాధించిన ఆటగాడు మనీష్ పాండే. 2009లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన పాండే సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత ఐపీఎల్లో పూణె వారియర్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల తరుపున మిడిలార్డర్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరుగాంచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 24 గేమ్స్ ఆడిన పాండే 31.61 యావరేజితో 569 పరుగులు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు.

దినేశ్ కార్తీక్
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. 2015 ఐపీఎల్ సీజన్లో దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో 16 మ్యాచ్లాడిన దినేశ్ కార్తీక్ 12.81 యావరేజితో 141 పరుగులు సాధించాడు. అదే, వికెట్ కీపింగ్ విషయానికి వస్తే దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 క్యాచ్లతో పాటు 4 స్టంపౌట్లు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో దినేశ్ కార్తీక్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు. ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని కోల్కతా జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్లాడి ఐదింట ఓటమిపాలై, ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

జయదేవ్ ఉనాద్కత్
2013 ఐపీఎల్ సీజన్లో జయదేవ్ ఉనాద్కత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో జయదేవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన ఎడమచేతి వాటం బౌలింగ్తో 13 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఆ తర్వాతి సీజన్లలో జయదేవ్ ఢిల్లీ డేర్డెవిల్స్, కోల్కతా నైట్రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో జయదేవ్ ఉనాద్కత్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.

కేఎల్ రాహుల్
గాయం కారణంగా 2017 ఐపీఎల్ సీజన్ మొత్తానికి కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. కానీ, అంతకముందు 2013, 2015, 2016 సీజన్లలో కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో బెంగళూరు తరుపున 5 మ్యాచ్లాడి 20 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, ఆ తర్వాత 2015లో 9 మ్యాచ్లాడి 142 పరుగులు చేశాడు. ఇక, 2016 సీజన్ వచ్చేసరికి మిడిలార్డర్లో అత్యంత కీలక ఆటగాడిగా మారాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన కేఎల్ రాహుల్ 44.11 యావరేజితో 397 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
