ఐపీఎల్ 2025 సీజన్కు రంగం సిద్దమైంది. మరో 10 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఈ నెల 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను ప్రారంభించాయి. ఐపీఎల్ 2025 టైటిలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్ బరిలో నిలిచారు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు షేక్ రషీద్, పైల అవినాష్, త్రిపుర్ణ విజయ్, సత్యనారాయణ రాజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
1.షేక్ రషీద్
గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లోనూ అతను సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించాడు. అండర్ 19 ప్లేయర్గా సత్తా చాటిన షేక్ రషీద్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర తరఫున 33 ఇన్నింగ్స్లు ఆడి 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 1204 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో ఒక సెంచరీతో 352 రన్స్ చేశాడు.

2.పైలా అవినాష్
వైజాగ్కు చెందిన పైలా అవినాష్ను పంజాబ్ కింగ్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో అవినాష్ బెజవాడ టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. పేస్ ఆల్రౌండర్ అయిన అవినాష్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరఫున 5 మ్యాచ్లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 81 పరుగులు చేశాడు. ఫినిషర్గా సత్తా చాటాడు.
3.త్రిపుర్ణ విజయ్
శ్రీకాకుళానికి చెందిన త్రిపుర్ణ విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆఫ్ స్పిన్నర్ అయిన విజయ్.. ఆంధ్ర తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 28 వికెట్లు తీసాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 4 మ్యాచ్లో 4 వికెట్లు, టీ20ల్లో 8 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ ఓనర్స్ అయిన జీఎమ్ఆర్ యాజమాన్యం స్వస్థలం శ్రీకాకుళం కావడంతో విజయ్కు అవకాశం ఇచ్చారు.
4. సత్యనారయణ రాజు..
కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన రాజు.. ఆంధ్ర తరఫున 8 ఫస్ట్ క్లాస్, 7 లిస్ట్ ఏ, 7 టీ20లు ఆడి 33 వికెట్లు తీసాడు.
5. నితీష్ కుమార్ రెడ్డి..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్గా ఎదిగిన నితీష్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ అందుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్.. మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ20ల్లోనూ హాఫ్ సెంచరీల మోత మోగించాడు. ఇప్పటి వరకు 15 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 2 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. బౌలింగ్లో మూడు వికెట్లు తీసాడు. ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసినా.. గత సీజన్లోనే అతనికి అవకాశం దక్కింది.
6.తిలక్ వర్మ..
హైదరాబాద్ స్టార్ బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. టీమిండియా తరఫున టీ20ల్లో తిలక్ వర్మ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు 38 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 6 హాఫ్ సెంచరీలతో 1156 పరుగులు చేశాడు.
7.మహమ్మద్ సిరాజ్..
హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్ను వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సిరాజ్ 93 వికెట్లు పడగొట్టాడు.