
ముంబై: దేశంలో మహిళల క్రికెట్కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరింత అభివృద్ధికి కృషి చేసే విధంగా బీసీసీఐ అడుగులు వేస్తుంది. శనివారం ఓ కీలక ప్రకటన చేసింది. జైపుర్ వేదికగా ఈ ఏడాది నాలుగు జట్లతో మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. 'మహిళల క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ కంకణం కట్టుకుంది. 2020 మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సారి టోర్నీలో నాలుగో జట్టును చూడబోతున్నాం' అని బోర్డు కార్యదర్శి జే షా తెలిపారు.
పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్ సమయంలో మహిళల మ్యాచ్లను నిర్వహించనున్నారు. జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సారి ఏడు మ్యాచులు జరుగుతుండటం ప్రత్యేకం. 2018లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించగా మంచి ఆదరణ లభించింది. ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్, ఐపీఎల్ సూపర్నోవాస్ జట్ల మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్ జరిగింది.
సూపర్ సక్సెస్ కావడంతో గత సీజన్లో మూడు జట్లతో జరగ్గా.. అత్యంత ఉత్కంఠగా మ్యాచ్లు సాగాయి. ఫైనల్ మ్యాచ్లో ఫలితం కోసం ఆఖరి బంతి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. ఐపీఎల్ సూపర్నోవాస్ చేతిలో ఐపీఎల్ వెలాసిటీ 4 వికెట్ల తేడాతో ఓడింది. హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన ఆయా జట్లకు నాయకత్వం వహించారు.