కరోనా దెబ్బ
తొలి టీ20 విజయానంతరం భారత జట్టులో కరోనా కలకలం రేగింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు వైరస్ సోకడంతో అతనికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, మనీశ్ పాండే, యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యారు.
దాంతో టీమిండియా నెట్ బౌలర్లను తీసుకొని ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దెబ్బతో టీమిండియా 9 మంది ప్రధాన ఆటగాళ్లను దూరం చేసుకోవాల్సి వచ్చింది. పూర్తిగా బెంచ్ బలగంతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా బ్యాటింగ్ పూర్తిగా బలహీనమైంది. ఇదే చివరి రెండు టీ20ల్లో భారత ఓటమికి కారణమైంది. కరోనా రాకుండా ప్రధానా ఆటగాళ్లు దూరం కాకుండా ఉంటే.. టీమిండియా సులువుగా విజయాన్నందుకునేది.
బ్యాట్స్మన్ ఆప్షన్ లేకపోవడం
కరోనాతో 9 మంది ఆటగాళ్లు దూరమవడంతో టీమిండియాకు ఆప్షన్ లేకుండా పోయింది. నెట్ బౌలర్లను జట్టుతో కలుపుకోవడంతో బౌలింగ్ వనరులున్నా.. ఓ బ్యాట్స్మన్ కొరత ఏర్పడింది. దాంతో రెండో టీ20లో నలుగురు అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆల్రౌండర్ లేకుండా కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్తో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెనువెంటనే వికెట్లు తీస్తే టేలండర్స్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది టీమిండియా బ్యాటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. జట్టులో ఒక ఆల్రౌండర్తో పాటు మరో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అందుబాటులో ఉన్నా సిరీస్ ఫలితం మరోలా ఉండేది.
యువ ఆటగాళ్ల విఫలం..
సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో లభించిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోలేకపోయారు. టీమిండియా తరఫున ఆడాలంటే ఎన్నో రోజులు నిరీక్షించాలి. కానీ ఈ పర్యటనలో నెట్ బౌలర్లకు కూడా చోటు దక్కింది. ఈ మూడు టీ20ల్లో భారత్ మొత్తం 19 ఆటగాళ్లను బరిలోకి దింపింది. కానీ యువ ఆటగాళ్లైన పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తీ, నితీశ్ రాణా, చేతన్ సకారియా తమ సత్తాను చాటలేకపోయారు.
వీరికి తోడు సీనియర్లు అయిన శిఖర్ ధావన్, సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ కూడా చేతులెత్తేయడంతో భారత్కు వరుస మ్యాచ్ల్లో ఓటమి తప్పలేదు. చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ సిరీస్ కోల్పోయేలా చేసింది. రెండో టీ20లో కొంచెం మెరుగ్గా ఫీల్డింగ్ చేసుంటే భారత్ మ్యాచ్ గెలిచి సిరీస్ కాపాడుకునేది.
గబ్బర్ కెప్టెన్సీ వైఫల్యం
కెరీర్లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన శిఖర్ ధావన్ వన్డే సిరీస్ విజయాన్నందించాడు. కానీ టీ20 సిరీస్లో మాత్రం కెప్టెన్గా విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలర్లను మార్చే విషయంలో అతను తబడ్డాడు. అంతేకాకుండా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో చాలా మిస్ ఫీల్డ్ అయ్యాయి. క్యాచ్లు డ్రాప్ అయ్యాయి.
ఇక మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలనే అతని వ్యూహం కూడా బెడిసి కొట్టింది. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్గా ధావన్ తన వ్యూహాలను అమలు చేయడంలో విఫలమయ్యాడు. రెండో టీ20లో సైనీకి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. మూడో టీ20లో రాహుల్ చాహర్కు ఆలస్యంగా బంతిని అందించాడు. వరుణ్పై ఎక్కువ నమ్మకం ఉంచగా అతను సత్తా చాటలేకపోయాడు. దాంతో భారత్కు ఓటమి తప్పలేదు.