న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 ముంగిట భారత అభిమానులను పలు సెంటిమెంట్స్ ఊరిస్తున్నాయి. ఇప్పటికే పలు సెంటిమెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ కోసం గత 12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న భారత అభిమానులు.. ఈ సారి గెలిచేందుకు ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆశలు రేకిత్తిస్తున్నారు.
ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ను ముద్దాడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై భారత్కు కలిసొచ్చే అంశం కాగా.. గత మూడు ప్రపంచకప్లు ఆతిథ్య దేశానికి దక్కాయని, ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఇప్పటికే తెలియజేశారు.

తాజాగా 2011కు సంబంధించిన కొన్ని విషయాలు.. 2023 రిపీట్ అయ్యాయని, ప్రపంచకప్ గెలవడం కూడా రిపీట్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు నాలుగు సెంటిమెంట్స్ రిపీట్ అయ్యాయని, రోహిత్ సేన విశ్వవిజేతగా నిలవడం ఖాయమంటున్నారు.
1. ఐపీఎల్ 2011లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవగా.. 2023 సీజన్లో కూడా ధోనీ సారథ్యంలోని సీఎస్కేనే టైటిల్ గెలిచింది.
2. యూరోపియన్ ఫుట్బాల్ ఆధ్వర్యంలో జరిగే ఛాంపియన్స్ లీగ్లో ప్రముఖ ఫుట్బాల్ మేనేజర్ పెప్ గార్డియోలా(స్పానిష్) 2011తో పాటు 2023లోనూ విజేతగా నిలిచాడు. 2011 ఛాంపియన్స్ లీగ్లో బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ విజేతగా నిలవగా.. పెప్ గార్డియోలా ఆ జట్టుకు మేనేజర్గా వ్యవహరించాడు. 2023లో మాంచెస్టర్ సిటీ విజేతగా నిలవగా.. ఈ జట్టుకు పెప్ గార్డియోలా మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
3. 2011లో బంగ్లాదేశ్ కెప్టెన్గా షకీబ్ అల్ హసన్ ఉండగా.. 2023లోనూ అతను మళ్లీ సారథిగా ఎంపికయ్యాడు.
4. 2011 ఆస్ట్రేలియా ఓపెన్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ విజేతగా నిలస్తే.. 2023 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను కూడా అతనే అందుకున్నాడు.
ఈ నాలుగు సెంటిమెంట్లు రిపీట్ అయ్యాయని, టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం కూడా ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.