ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా నిరాశపరిచింది. పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలు మాత్రమే నమోదు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిన రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అతనితో పాటు ఇతర ఆటగాళ్ల వైఫల్యం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే జట్టు బలహీనతలపు అధిగమించడంపై లక్నో సూపర్ జెయింట్స్ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు జట్టుకు భారంగా మారిన ఓ ఐదుగురు ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్నే వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్ను రూ. 27 కోట్ల ఆల్టైమ్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అతనికి సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ అతను మాత్రం 14 మ్యాచ్ల్లో 24.45 సగటు 133.17 స్ట్రైక్రేట్తో 269 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. తమ ఆఖరి మ్యాచ్లో పంత్ శతకంతో చెలరేగాడు. కానీ ఈ మ్యాచ్లోనూ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరోవైపు కెప్టెన్గా కూడా రిషభ్ పంత్ విఫలమయ్యాడు. భారీ ధర నేపథ్యంలో అతన్ని వేలంలోకి వదిలేసి తక్కువ ధరకు మళ్లీ తీసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు.

ప్రతిభావంతమైన పేసర్ అని, అత్యంత వేగంతో బౌలింగ్ చేయగలిగే సామర్థ్యం ఉందని మాయంక్ యాదవ్కు లక్నో సూపర్ జెయింట్స్ గత మూడు సీజన్లుగా అండగా నిలుస్తోంది. అతను మాత్రం జట్టుకు భారంగానే మారాడు. తరుచూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. ఎక్స్ట్రా పేస్ను రాబట్టే విషయంలో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతూ గాయాల బారిన పడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకోగా.. అతను రెండు మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు మాత్రమే తీసి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తరుచూ గాయాల బారిన పడుతున్న మయాంక్ యాదవ్కు వచ్చే సీజన్ ముంగిట లక్నో గుడ్బై చెప్పే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.7.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన డేవిడ్ మిల్లర్ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. 11 మ్యాచ్లు ఆడిన అతను 30.60 సగటుతో 153 పరుగులే చేశాడు.అతని అత్యధిక స్కోర్ 27 పరుగులు మాత్రమే. విధ్వంసకర ఫినిషర్గా గుర్తింపు పొందిన మిల్లర్.. ఈ సీజన్లో తన బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఆటగాడిని లక్నో తీసుకోవచ్చు.
మాయంక్ యాదవ్ తరహాలోనే తరుచూ గాయల బారిన పడి జట్టుకు దూరమవుతున్న మోహ్సిన్ ఖాన్ను కూడా లక్నో వదిలేసే అవకాశం ఉంది. రూ. 4 కోట్లకు మోహ్సిన్ ఖాన్ను తీసుకోగా.. అతను సీజన్ ఆరంభానికి ముందే గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకున్నారు. గాయాల బెడద నేపథ్యంలో మోహ్సిన్ ఖాన్కు కూడా లక్నో ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది.