మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచినా మహిళల క్రికెట్లో కొత్త ఛాంపియన్ అవతరిస్తోంది. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఈ క్రమంలోనే తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు సన్నదమవుతున్నాయి.
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆనందంలో సౌతాఫ్రికా ఉంటే.. డిఫెండింగ్ ఛాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నాయి. లీగ్ దశలో భారత్పై సౌతాఫ్రికానే పైచేయి సాధించింది. అనవసరం తప్పిదాలతో ఆ మ్యాచ్లో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. సెమీఫైనల్లో చూపించిన తెగువను ఫైనల్లోనూ రిపీట్ చేస్తే టీమిండియా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అలా కాకుండా ఆసీస్నే ఓడించాం.. సౌతాఫ్రికా ఎంత? అని తేలికగా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే నాలుగు అంశాలపై ఫోకస్ పెట్టాలి.

సౌతాఫ్రికా ప్రధాన బ్యాటింగ్ బలం ఆ జట్టు కెప్టెన్ లారా వాల్వార్డ్. ఆమె ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్లో ఇంగ్లండ్పై ఏకంగా 169 పరుగులతో సత్తా చాటింది. ఆమెను భారత బౌలర్లు కట్టడిని చేస్తే.. విగతవారిని అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. లీగ్ దశలోనూ లారా(70)నే హాఫ్ సెంచరీతో చెలరేగింది. కాబట్టి ఆమెను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగాలి. లారాను త్వరగా ఔట్ చేస్తే.. నదినె డి క్లార్క్, ట్రైయన్, తజ్మిన్ బ్రిట్స్లను కట్టడి చేయడం సులువే. బౌలింగ్లో మరిజన్నె కాప్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాల్తో కూడుకున్న వ్యవహారమే. సెమీస్లో కాప్ ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతననాన్ని శాసించింది. అయబోంగా ఖాకా కూడా సూపర్ ఫామ్లో ఉంది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తే ట్రైయన్ కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఈ ముగ్గురిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి.
నవీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే ఛేజింగ్లో ఫైనల్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. భారత్ తరహాలో సౌతాఫ్రికా కూడా ఒత్తిడిని తట్టుకోలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి 300 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేస్తే సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతారు. దాన్ని భారత బౌలర్లు క్యాష్ చేసుకోవాలి. అలా కాకుండా భారత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సెమీస్ తరహాలోని ఒత్తిడి తట్టుకోని ఆడాలి. బ్యాటర్లు ఏ మాత్రం తప్పు చేయవద్దు.
భారత ప్రధాన బలం బ్యాటింగ్. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచ్ ఘోష్ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోసారి ఈ ఐదుగురు బ్యాటర్లు చెలరేగితే భారత్కు తిరుగుండదు. వీరికి విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా తోడైంది. సెమీస్లో విఫలమైనా.. తన దూకుడు మంత్రాన్ని చూపించింది. ఐదు బంతులే ఆడినప్పటికీ రెండు బౌండరీలు బాదింది. ఫైనల్లో ఆమె దూకుడైన ఆరంభం ఇస్తే.. భారత్ భారీ స్కోర్ చేయడం పక్కా. ఈ టోర్నీలో హయ్యెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్న స్మృతి మంధాన కూడా బాధ్యతగా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్కు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదు. జెమీమా, దీప్తి, రిచా ఘోష్ తమ ఫామ్ కొనసాగించాలి.
ఈ టోర్నీలో టీమిండియాను కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది బౌలింగే. ముఖ్యంగా పేసర్లు క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీ చరణి, అమన్జోత్ కౌర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. పేసర్లు కూడా చెలరేగితే బౌలింగ్ విభాగాన్ని తిరుగుండదు. సెమీస్లో ఆడిన కాంబినేషన్నే టీమిండియా కొనసాగించనుంది. అయితే రాధా యాదవ్ స్థానంలో స్నేహ్ రాణాను జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సమష్టి ప్రదర్శన కనబరిస్తేనే భారత జట్టుకు టైటిల్ అందుతుంది. లేదంటే మరోసారి నిరాశే మిగిలి ఓ పీడకలగా మిగిలిపోతుంది.