
ఇర్ఫాన్ పఠాన్
సంచలన ప్రదర్శనతో టీమిండియాలోకి దూసుకొచ్చిన మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అనతి కాలంలోనే స్టార్ పేసర్గా ఎదిగాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో అరంగేట్ర మ్యాచ్లో ఆడమ్ గిల్క్రిస్ట్ను క్లీన్ బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పఠాన్.. అదే జోరును కొనసాగించాడు. బ్యాటింగ్లోనూ సత్తా చాటి మేటి ఆల్రౌండర్ అనిపించాడు. ద్రవిడ్ సారథ్యంలోనూ అదరగొట్టాడు. ధోనీ సారథ్యంలోనూ భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ జట్టు, కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లోనూ ఆడాడు. అయితే 2009లో అతను జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.
ఫామ్ కోల్పోవడంతో ధోనీ అతన్ని పక్కనపెట్టేసాడు. దాంతో 2011 వన్డే ప్రపంచకప్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా.. జట్టులో నెలకొన్న పోటీ నేపథ్యంలో అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ఇక 2013 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో అవకాశం దక్కినా.. ధోనీ అతనికి తుది జట్టులో చోటివ్వలేదు. ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ టోర్నీ తర్వాత పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది.

మనోజ్ తివారి
పశ్చిమ బెంగాల్ క్రికెటర్, ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారికి ధోనీ సారథ్యంలో తీరని అన్యాయం జరిగింది. అప్పడు జట్టులో ఉన్న తీవ్ర పోటీ కారణంగా మనోజ్ తివారీ టన్నుల కొద్దీ పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేసిన మనోజ్ తివారి..2008లో ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మరో మూడేళ్ల వరకు భారత జట్టులోకి రాలేకపోయాడు. వెస్టిండీస్తో 2011లో మళ్లీ ఆడిన తివారి.. ఐదో మ్యాచ్లో సెంచరీ బాదాడు. ఒక పరుగుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత బ్యాటింగ్తో ఆదుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దాంతో జట్టులో అతని స్థానం సుస్థిరమని అంతా అనుకున్నారు. కానీ అతనికి మరుసటి మ్యాచ్లోనే అవకాశం దక్కలేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా... తివారి ఇప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.

రాబిన్ ఊతప్ప..
20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన రాబిన్ ఊతప్ప ధోనీ కారణంగా అవకాశాలు అందుకోలేకపోయాడు. 2006లో ఇంగ్లండ్తో జరిగిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే 86 పరుగులతో ఊతప్ప సత్తా చాటాడు. 2007 వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా కొనసాగాడు. ధోనీ సారథిగా ఎంపికైన తర్వాత కూడా ఊతప్ప జట్టులో కొనసాగాడు. 2007టీ20 ప్రపంచకప్ల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ బరిలోకి దిగిన ఊతప్ప.. 2010లో జట్టుకు దూరమయ్యాడు. దాంతో 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించినా.. సెలెక్టర్లు అతనికి అవకాశం ఇవ్వలేదు. దేశవాళీలో సత్తా చాటినా టీమిండియా పిలుపు రాలేదు. 2015 జింబాబ్వే పర్యటనతోనే రాబిన్ ఊతప్ప కెరీర్ ముగిసిపోయింది.

మునాఫ్ పటేల్..
భారత క్రికెట్లో అంతగా గుర్తింపు పొందని క్రికెటర్ ఎవరైన ఉన్నారంటే అది మునాఫ్ పటేల్. అతనికి రావాల్సిన పేరు రాలేదు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టులోకి వచ్చిన ఈ మీడియం పేసర్ భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2007 వన్డే ప్రపంచకప్ ఆడిన మునాఫ్ పటేల్.. ధోనీ సారథ్యంలోనూ కొనసాగాడు. 2011 వన్డే ప్రపంచకప్ సెమీస్లో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. కీలకమైన పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్లను ఔట్ చేసాడు. దాంతో భారత దిగ్గజ పేసర్గా మునాఫ్ పటేల్ ఎదుగుతాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు అదే ఏడాది సెప్టెంబర్లో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.


Click it and Unblock the Notifications












