జోరుగా బెట్టింగ్..
ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియాకు పండగే. ఐసీసీ ఈవెంట్లకు కూడా పెట్టనంత బెట్టింగ్ ఐపీఎల్ సందర్భంగా జరుగుతున్నదంటే అతిశయోక్తి లేదు. దేశంలో ప్రతీ పల్లె, నగరం ఈ దందాలో మునిగి తేలుతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ కూడా అంగీకరించారు.
ఈ బెట్టింగ్ వ్యవహారంతోనే గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించారు. దీనికి కారణం స్వయంగా యాజమాన్యంలోని కీలక వ్యక్తులు బెట్టింగ్లో పాల్గొన్నారు. ఆ విషయం ఢిల్లీ పోలీసులు వెలుగులోకి తెచ్చే వరకు కనీసం బీసీసీఐకి కూడా తెలియదు.
పార్టీల్లో ఆటగాళ్ల రచ్చ..
కొన్నేళ్ల క్రితం ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్ అనంతరం ఆయా ఫ్రాంచైజీలు ఆఫ్టర్ పార్టీలు అరేంజ్ చేసేవి. అక్కడ విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, అమ్మాయిలు అందుబాటులో ఉండేవారని కానీ ఆ విషయంలు బయటకు పొక్కుండా బీసీసీఐ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని సార్లు మద్యం మత్తులో సొంత జట్టు సభ్యులే గొడవలు పడేవారని.. దీంతో యాజమాన్యాలు ఆ పార్టీలను రద్దు చేసినట్లు టీమ్ వర్గాలు సమాచారం. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ వెలుగు చూడక ముందు రేవ్ పార్టీలు కూడా నిర్వహించారని.. అయితే పోలీస్ నిఘా పెరగడంతో వాటిని ఆపేసినట్లు సమాచారం.
ఐపీఎల్లో జాతి వివక్ష..
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జాతివివక్షపై తీవ్రమైన చర్చజరిగింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం సందర్భంగా ఎంతో మంది క్రికెటర్లు కూడా తమకు జరిగిన వివక్షను బయటపెట్టారు. కానీ అంతకంటే ముందే ఐపీఎల్లో వివక్ష కొనసాగింది. 2011లో చీర్ లీడర్స్ విషయంలో ఇలాంటి వివక్ష కొనసాగిందని దక్షిణాప్రికాకు చెందిన గాబ్రియేలా పాస్కోలో అనే చీర్ లీడర్ చెప్పింది.
ముంబై ఇండియన్స్ తరపున ఆమె చీర్లీడర్గా ఆ ఏడాది పని చేసింది. అయితే బీసీసీఐ, ముంబై ఇండియన్స్ పెద్దలు నల్ల వారిని చీర్ లీడర్గా పెట్టొద్దని హుకుం జారీ చేశారని తెలిపింది. అమెరికా, రష్యా, యూరోప్ దేశాలకు చెందిన వారిని మాత్రమే చీర్ లీడర్లుగా నియమించాలని ఆదేశించడంతో ఆమె వారితో వాదనకు దిగింది. కానీ బీసీసీఐ ఆ వివాదాన్ని ఆనాడే తొక్కిపెట్టింది.
కనుమరుగైన ఆటగాళ్లు..
ఐపీఎల్లో స్థానిక క్రికెటర్లు చాలా మంది పలు ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. బీసీసీఐ ఒత్తిడితో ఫ్రాంచైజీలు వారికి జట్టులోకి తీసుకోలేక తప్పలేదు. అయితే అలా ఎంపికైన క్రికెటర్లు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వారిని తుది జట్టులోకి తీసుకోవడానికి ఏ యాజమాన్యం సుముఖంగా లేదు. రికీ భయ్, బాబా అపరాజిత్ వంటి టాలెంట్ కలిగిన క్రికెటర్లు మూడు నాలుగు సీజన్ల పాటు బెంచ్కే పరిమితం అయ్యారు.
వారికి ప్రతీ ఏడాది డబ్బు అయితే చెల్లించే వారు. కానీ ఒక్కరికీ ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. టి. నటరాజన్ కూడా రెండేళ్ల పాటు పంజాబ్ జట్టు బెంచ్పై ఉన్నాడు. అతనికి ఒక సారి అవకాశం ఇచ్చాకే అతని ప్రతిభ అందరికీ తెలిసింది.