
దుబాయ్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు చివరి ప్రధాన టోర్నీ అయిన ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ కోసం 10 మంది భారత బాక్సర్లు శనివారం ఉదయం దుబాయ్ చేరుకున్నారు. అయితే వాళ్ల విమానం దాదాపు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. స్పెషల్ ఫ్లైట్లో వెళ్లిన భారత బాక్సర్ల బృందానికి ఆ నగరంలో దిగేందుకు కావాల్సిన అనుమతుల విషయంలో జాప్యం కలగింది.
దాంతో ఆ విమానం దిగేందుకు సిగ్నల్ ఇవ్వడంలో గందరగోళం తలెత్తడంతో అది గాల్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు అక్కడి భారత రాయబార కార్యాలయం చొరవతో అవసరమైన దరఖాస్తులు అన్ని పూర్తి చేసి ఆ ప్రక్రియను ముగించారు.
మరోవైపు అంతసేపు గాల్లోనే ఉండడంతో ఇంధనం అయిపోతుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆ విమానాన్ని దించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనపై పౌర విమానయాన జనరల్ డైరెక్టరేట్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆ విమానం ఉదయం 6.20 గంటలకు అక్కడ దిగింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా ఇక్కడి నుంచి వచ్చే విమానాలపై యూఏఈ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ చాంపియన్షిప్ కోసం అనుమతి తీసుకోవడంతో ప్రత్యేక స్పైస్జెట్ విమానంలో 31 మంది సభ్యుల బృందం అక్కడికి చేరుకోగలిగింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సహా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన బాక్సర్లూ అందులో ఉన్నారు. సోమవారం ఈ చాంపియన్షిప్ ఆరంభం కానుంది. 'భారత బాక్సింగ్ బృందం దుబాయ్లో అడుగుపెట్టి హోటల్ చేరుకుంది.
వాళ్లకు విమానాశ్రయంలో ఒకసారి, హోటల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన అన్ని అనుమతులతో బాక్సింగ్ జట్టు ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లింది. మన బాక్సర్లు ఆసియా చాంపియన్షిప్లో పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన యూఏఈలోని భారత దౌత్య కార్యాలయానికి కృతజ్ఞతలు'అని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.