న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ టోర్నీలోని మ్యాచ్ల వివరాలను ఐసీసీ గత మంగళవారమే వెల్లడించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి ఇంకా 100 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో జట్లన్నీ తమ ప్రిపరేషన్పై ఫోకస్ పెట్టాయి.
సొంతగడ్డపై జరగనున్న ఈ మెగాటోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియాకు ఇది సువర్ణవకాశం అంటూ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియాలో ఉన్న అతిపెద్ద సమస్యను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బయటపెట్టాడు.

ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్లకు ప్రస్తుత టీమిండియాకు ఉన్న వ్యత్యాసం గురించి వివరించాడు. 2011 వన్డే ప్రపంచకప్లో టీమిండియాకు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా రూపంలో టాపార్డర్లో లెఫ్టాండర్స్ ఉన్నారని గుర్తు చేశాడు. ప్రస్తుత జట్టులో టాప్-5లో ఒక్క లెఫ్టాండర్ లేడని, రవీంద్ర జడేజా ఒక్కడే ఎడమ చేతివాటం బ్యాటర్ అని తెలిపాడు.
వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలని, యువ ఆటగాళ్లు అయిన ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మలను జట్టులోకి తీసుకొని తీర్చిదిద్దుకోవాలన్నాడు. వీరికోసం సీనియర్ ఆటగాళ్లను కూడా పక్కనపెట్టాల్సిందేనని చెప్పాడు.
1.యశస్వీ జైస్వాల్: 2011 వన్డే ప్రపంచకప్లో గౌతం గంభీర్ పోషించిన పాత్రను యశస్వీ జైస్వాల్ పోషించగలడు. గంభీర్లా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం యశస్వీకి ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా సత్తా చాటిన యశస్వీ.. దేశవాళీ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ప్రదర్శనతోనే వెస్టిండీస్ పర్యటనలోని టెస్ట్ టీమ్కు ఎంపికయ్యాడు. కానీ వన్డే టీమ్లోకి అతన్ని తీసుకోలేదు.
యశస్వీ జైస్వాల్ ఫస్ట్ డౌన్లో ఆడిస్తే నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ అనుభవం జట్టుకు పనికి వస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ ఆటగాళ్లకే ప్రాధానత్య ఇస్తోంది.
2. ఇషాన్ కిషన్: టాప్-5లో ఆడగలిగే మరో లెఫ్టాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్. రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ దూరమైన నేపథ్యంలో ఇషాన్ కిషన్ జట్టులో కొనసాగుతున్నా.. వికెట్ కీపర్గా అతనికి తొలి ప్రాధాన్యత దక్కడం లేదు. కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా ఆడిస్తూ ఇషాన్ కిషన్ను బెంచ్కే పరిమితం చేస్తున్నారు.
బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ సాధించినా.. అతనికి వీలైనన్ని అవకాశాలు దక్కడం లేదు. రోహిత్ జతగా అతన్ని ఓపెనర్గా ఆడించవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కేఎల్ రాహుల్పై వేటు వేసి ఇషాన్ కిషన్కు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

3. రింకూ సింగ్/తిలక్ వర్మ: 2011 వన్డే ప్రపంచకప్లో సురేశ్ రైనా పోషించిన పాత్రను రింకూ సింగ్, తిలక్ వర్మ పోషించగలరు. ఐపీఎల్ 2023 సీజన్లో ఈ ఇద్దరూ సంచలన బ్యాటింగ్తో చెలరేగారు. ముఖ్యంగా రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఎలాంటి పరిస్థతుల్లోనైనా విజయాన్నందించే సత్తా రింకూ సింగ్ సొంతం.
అతన్ని జట్టులోకి తీసుకుంటే ఫినిషర్గా ఉపయోగపడుతాడని విశ్లేషకులు సూచిస్తున్నారు. తిలక్ వర్మ కూడా టాప్-5లో రాణించే బ్యాటర్ అని సూచిస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం వీరి పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. టాప్-5 బ్యాటర్లలో ఇద్దరు లెఫ్టాండర్స్ ఉంటే టీమ్ కాంబినేషన్ సరిగ్గా ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లకు సమస్యగా మారుతోంది.