
పోటీలో మూడు ఫ్రాంచైజీలు..
ఐపీఎల్ 2020 సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు సరైన ఆటగాళ్లు లేక ఇబ్బందులు పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు నెంబర్ 3 స్థానానికి సరైన బ్యాట్స్మన్ లేక సతమతమయ్యాయి. శనివారం ముగిసిన బీబీఎల్ సీజన్లో మలన్ నిరాశాజనకమైన ప్రదర్శన చేశాడు.
కానీ అతని ఐసీసీ ర్యాంకింగ్, గత మ్యాచ్ల్లో బ్యాటింగ్లో దూకుడు పరిశీలించిన పలు ఫ్రాంచైజీలు ఈ సీజన్లో మలన్ జట్టులో ఉంటే బ్యాటింగ్లో బలం పెరుగుతుందని భావిస్తున్నాయి. బీబీఎల్ 2021లో 10 మ్యాచ్లు ఆడిన మలన్ 265 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 75 మాత్రమే. అయినా సరే మలన్ కోసం ఆ మూడు ఫ్రాంచైజీలతో పాటు ఇతరులు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు
ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలన్ బేస్ప్రైజ్ రూ. 1.5 కోట్లతో అందుబాటులో ఉన్నాడు. అయితే ఈసారి వేలంలో ఇతని కోసం పోటీ గట్టిగా ఉండటంతో రికార్డు ధరకు అమ్ముడుపోతాడని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అత్యధిక ధర పొందిన పాట్ కమిన్స్(రూ.15.5 కోట్లు), బెన్ స్టోక్స్(రూ. 14.5 కోట్లు) గ్లేన్ మ్యాక్స్ వెల్(రూ.10.5 కోట్లు), క్రిస్ మోరీస్(రూ.10 కోట్లు)ధరను ఈసారి డేవిడ్ మలన్ అధిగమించే అవకాశం ఉన్నది.

ఆలస్యంగా వచ్చినా..
లండన్లో పుట్టి సౌతాఫ్రికాలో పెరిగిన డేవిడ్ మలన్ తండ్రి, సోదురుడు కూడా ఫస్ట్ క్లాస్ ఆడిన క్రికెటర్లే. 2006లో మిడిల్ సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన డేవిడ్.. 2019 నుంచి యార్క్ షైర్ తరఫున ఆడుతున్నాడు. మిడిల్ సెక్స్ కౌంటీ జట్టుకు మూడు ఫార్మాట్లలో మలన్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఎన్నో ఏళ్లుగా కౌంటీ క్రికెట్లో రాణిస్తున్నా మలన్ చాలా ఆసల్యంగా ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీ20 క్రికెట్లో అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్గా ఎదిగాడు.

వేలంలో 1097 మంది..
ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1097 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి అత్యధికంగా 56 ఎంట్రీలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా తమ జట్టులోకి 25 మంది ఆటగాళ్లను తీసుకుంటే వేలంలోకి 61 మందిని తీసుకుంటామని ఐపీఎల్ తెలిపింది. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. 18న మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












