టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన తిలక్ వర్మకు వృషణాల్లో గాయమైంది.
దాంతో అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరమని సూచించారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నీకి తిలక్ వర్మ దూరం కావాల్సి వచ్చింది. అయితే తిలక్ వర్మ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతని స్థానంలో ఆడే ఆటగాడు ఎవరో కూడా చెప్పలేదు. తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. వారిపై ఓ లుక్కెద్దాం.

తిలక్ వర్మ స్థానాన్ని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్గా విఫలమవడంతో వేటుకు గురైన శుభ్మన్ గిల్.. వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. తిలక్ వర్మ గైర్హాజరీ నేపథ్యంలో శుభ్మన్ గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గిల్ మిడిలార్డర్ బ్యాటర్గానే తన టీ20 కెరీర్ ప్రారంభించాడు. అతను మిడిలార్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. 2018 నుంచి 175 టీ20లు ఆడిన గిల్.. 5,412 పరుగులు చేశాడు. అయితే న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో గిల్ చెలరేగితేనే అతనికి పిలుపు దక్కనుంది.
తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కవచ్చు. టీ20ల్లో అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ 2025 సీజన్లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ భారత టీ20 జట్టులో అయ్యర్కు చోటు దక్కలేదు. పంజాబ్ తరఫున అయ్యర్ 604 పరుగులు చేశాడు. 2023 నుంచి అయ్యర్ ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అయ్యర్కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వవచ్చు.అతను కూడా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో సత్తా చాటాల్సి ఉంది.
తిలక్ వర్మను భర్తీ చేసే ఆటగాళ్ల రేసులో రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్కు ప్రాధాన్యత ఇస్తే పంత్కు అవకాశం దక్కుతుంది. ఇప్పటికే వికెట్ కీపర్గా సంజూ శాంసన్ ఉన్న నేపథ్యంలో పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే టీ20ల్లో పంత్కు గొప్ప ఫామ్ లేదు. దూకుడుగా ఆడే సామర్థ్యం ఉంది. టీ20 ప్రపంచకప్ 2024 విన్నింగ్ టీమ్లో పంత్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు అతను 144.40 స్ట్రైక్రేట్తో 5291 పరుగులు చేశాడు.