టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి నేడు(డిసెంబర్ 23) ప్రత్యేకమైన రోజు. 20 ఏళ్ల క్రితం 2004లో ఇదే రోజు ధోనీ చరిత్ర మొదలైంది. బంగ్లాదేశ్తో వన్డే మ్యాచ్తో మహీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. జులపాల జుట్టు.. తెల్ల ప్యాడ్లు కట్టుకొని వీడెవడ్రా.. అని అభిమానులు ఆశ్చర్యపోయే విధంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. కానీ సహచర ఆటగాడి సమన్వయ లోపంతో రనౌటై గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
తర్వాత ఒకటి రెండు మ్యాచ్లు విఫలమైనా.. విశాఖ తీరానా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి తన అసలు సిసలు ఆటను చూపించాడు. అప్పటి టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ.. ధోనీపై నమ్మకంతో తన బ్యాటింగ్ స్థానాన్ని అతనికిచ్చాడు. ఫస్ట్ డౌన్లో బరిలోకి దిగిన ధోనీ.. ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం సాధించాడు.

అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోని ధోనీ మంచి ఫినిషర్గా గుర్తింపు పొందాడు. 2007లో సారథ్య బాధ్యతలు అందుకుని మరింత ఎత్తుకు ఎదిగాడు. ఆపై క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్ల సరసన చోటు సంపాదించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు.
విచిత్రంగా ఎంఎస్ ధోనీ ఏ రనౌట్తో కెరీర్ను ప్రారంభించాడో యాదృశ్చికంగా అదే రనౌట్తో కెరీర్ను ముగించాడు. 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మార్టిన్ గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రో ద్వారా ధోనీ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత మహీ ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. చివరకు 2020లో ఆగస్ట్ 15న రాత్రి 7 గంటల సమయంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నానని ఓ చిన్న ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా.. ధోనీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. గత నాలుగు సీజన్లుగా చెన్నై సూపర్ కంగ్స్ తరఫున తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు.
తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోనీ 90 టెస్ట్లు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 6 శతకాలు, 33 హాఫ్ సెంచరీలతో 4876 పరుగులు చేసిన ధోనీ.. వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలతో 10773 పరుగులు సాధించాడు. టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలతో 1617 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా మూడు ఫార్మాట్లలో కలిపి 634 క్యాచ్లు అందుకోవడంతో పాటు 195 స్టంపౌట్స్ చేశాడు.