
ప్రపంచకప్ను వదిలేవాళ్లు కాదు
భారత్ 1983లో తొలిసారి ప్రపంచకప్ సాధించి శుక్రవారానికి 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పటి జట్టు సభ్యులతో కలిసి ఓ జాతీయ ఛానెల్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో ఆనతి దిగ్గజాలంతా పాల్గొని.. వారి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. 1983, 2011 భారత్ ప్రపంచకప్ విజేత జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తే ఎవరు గెలిచేవాళ్లని యాంకర్ అడగ్గా.. మదన్లాల్ స్పందించారు. 'కచ్చితంగా మేమే గెలిచేవాళ్లం. మా జట్టులో అందరూ పోరాడే ఆటగాళ్లే. వారు ప్రపంచకప్ను వదిలేవాళ్లు కాదు. ప్రతి ఒక్కరూ బాగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. దాంతో ఎలాగైనా గెలిచేవాళ్లం' అని మదన్లాల్ అన్నారు.

మేమే గెలిచేవాళ్లం
అనంతరం రోజర్ బిన్నీ స్పందిస్తూ... 'రెండు జట్ల మధ్య మ్యాచ్ను లార్డ్స్లో నిర్వహిస్తే తప్పకుండా మేమే గెలిచేవాళ్లం' అని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో సందీప్ పాటిల్ మాట్లాడుతూ... 1983 టోర్నీలో తనకెంతో ఇష్టమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్పై భారత్ గెలవడం తనకు ప్రత్యేకమని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు తన తల్లి పుట్టినరోజని, ఆ మ్యాచ్ జరిగే రోజు ఆమె ఓ మంచి బహుమతిని ఇవ్వమని కోరారని గుర్తుచేసుకున్నారు. ఆ మ్యాచ్లో తాను 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినట్లు పాటిల్ తన ఆనందాన్ని తెలిపారు.
WTC Final: 'తప్పుడు అంచనా వేశా.. న్యూజిలాండ్ అభిమానులారా నన్ను క్షమించండి'

మదన్లాల్, అమరనాథ్ మాయ
1983 ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 54.5 ఓవర్లలో 183 పరుగులకి ఆలౌటైంది. క్రిస్ శ్రీకాంత్ (38: 57 బంతుల్లో 7x4, 1x6)తో పాటు మహీందర్ అమరనాథ్ (26: 80 బంతుల్లో 3x4), సందీప్ పాటిల్ (27: 29 బంతుల్లో 1x6), కపిల్ దేవ్ (15: 8 బంతుల్లో 3x4) విలువైన పరుగులు చేశారు. సూపర్ ఫామ్లో ఉన్న వెస్టిండీస్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేస్తుందని అంతా ఊహించారు. కానీ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. వివ్ రిచర్డ్స్ (33: 28 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మదన్లాల్, అమరనాథ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

చెలరేగిన గంభీర్, ధోనీ
2011 ఏప్రిల్ 2న ముంబై వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె ( 88 బంతుల్లో 13 ఫోర్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ సెహ్వాగ్ (0), టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో గంభీర్ (122 బంతుల్లో 9 ఫోర్లు 97) కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. కోహ్లీ ఔటైనా ధోనీతో కలిసి నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. యువరాజ్తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ను ముగించాడు.


Click it and Unblock the Notifications












