టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల క్యాష్ రివార్డ్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమకు కూడా నగదు బహుమతి అందజేయాలని 1983 ప్రపంచకప్ విన్నర్ ఒకరు డిమాండ్ చేశారు. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా 1983 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ విజయంతోనే భారత్లో క్రికెట్ పిచ్చికి బీజం పడింది. ఆ సమయంలో బీసీసీఐ దగ్గర డబ్బులు లేకపోవడంతో క్యాష్ రివార్డ్ ప్రకటించలేదు. దివంగత గాయనీ లతా మంగేష్కర్తో ఢిల్లీలో సంగీత కచేరి నిర్వహించి బీసీసీఐ కొంత డబ్బును సేకరించింది. ఆ డబ్బులనే కపిల్ సేనకు నగదు బహుమతిగా అందజేసింది.

తాజాగా రోహిత్ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల క్యాష్ రివార్డ్ ప్రకటించడంతో.. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని ఓ సభ్యుడు తమకు కూడా క్యాష్ రివార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ జట్టులో కొంతమంది పనిచేస్తున్నా.. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాము ప్రపంచకప్ గెలిచిన సమయంలో బోర్డు దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు ఇవ్వడానికి ఏమైందని ప్రశ్నించాడు.
'రూ. 125 కోట్ల క్యాష్ రివార్డ్ చాలా పెద్దది. టీమిండియా సంతోషించే విషయం. మేం ప్రపంచకప్ గెలిచిన సమయంలో మాకు క్యాష్ రివార్డ్ ఇవ్వలేదు. అప్పుడు బీసీసీఐ దగ్గర డబ్బులు లేవని చెప్పారు. కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది? మా జట్టులోని కొంతమందికి మాత్రమే పనిదొరికింది. చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మాపై కూడా బీసీసీఐ ఓ కన్నేయ్యాలి. మమ్మల్ని ఆదుకోవాలి.'అని పేరు చెప్పడానికి ఇష్టపడిన 1983 ప్రపంచకప్ విజేత అన్నారు.
11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రోహిత్ సేన ఐసీసీ టైటిల్ గెలవడంతో బీసీసీఐ భారీ మొత్తంలో నగదు బహుమతిని ప్రకటించింది. ఈ క్యాష్ ప్రైజ్ను జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులకు అందజేయనున్నారు. టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన ప్రధాన జట్టులోని 15 మంది సభ్యులతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రూ. 5 కోట్ల చొప్పున క్యాష్ రివార్డ్ అందనుంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు రూ.2.5 కోట్ల చొప్పున ఇవ్వనుండగా.. టీమిండియా సహాయక సిబ్బందిలోని తొమ్మిది మందికి తలో రూ. 2 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో టీమిండియా ఫిజియోలు కూడా ఉన్నారు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు తలో రూ.కోటి దక్కనుంది.