
కోల్కతా: కరోనా కట్టడికి భారత మహిళా క్రికెటర్, 16 ఏళ్ల రిచా ఘోష్ ముందుకొచ్చింది. తన వంతు సాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి అందరికి ఆదర్శంగా నిలిచింది.
సంక్షోభ పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన దేశ పౌరురాలిగా స్పందించానని రిచా తెలిపింది. శనివారం రూ. లక్ష చెక్కును సిలిగురి జిల్లా న్యాయమూర్తికి రిచా తండ్రి అందించారు. దీంతో మహిళా క్రికెటర్ల విరాళల కార్యక్రమానికి ఈ యువ ప్లేయర్ నాంది పలికినట్లైంది.
ఇప్పటి వరకు ఏ మహిళా క్రికెటర్ అధికారికంగా విరాళాన్ని ప్రకటించలేదు. టీ20 వరల్డ్కప్ సన్నాహకంగా ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ తరపున రిచా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేట్రం చేసింది. అలాగే టీ20 ప్రపంచకప్లోనూ రెండు మ్యాచ్లు ఆడింది.
ఇక కరోనాపై పోరుకు క్రీడాలోకం స్పందిస్తుంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, సురేశ్ రైనా, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, బజరంగ్ పూనియా, హిమాదాస్ విరాళాలు అందించారు. సంపన్న బోర్డు, క్రికెట్ పెద్దన్న బీసీసీఐ రూ.51 కోట్ల విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్కు అందజేసింది.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ఆదివారం రూ. కోటి విరాళాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సహాయనిధికి, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ ఇంత వరకు ఎలాంటి సాయాన్ని ప్రకటించలేదు. దీంతో వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళాక్రికెటర్ రిచా ఘోష్ను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియావేదకిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు 970కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.