
సచిన్ వికెట్ను కాపాడుకుంటాడు
తాజాగా ముత్తయ్య మురళీధరన్ ఈఎస్పీఎన్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలపై మాట్లాడాడు. 'సచిన్ టెండూల్కర్కు బౌలింగ్ చేయడంలో పెద్దగా భయపడాల్సిన పని లేదు. సచిన్ చాలా జాగ్రత్తగా వికెట్ను కాపాడుకుంటాడు. బంతిని అంచనా వేసి ఆడటంలో దిట్ట. అతడికి టెక్నిక్ బాగా తెలుసు.
నా కెరియర్లో సచిన్ బ్యాటింగ్లో ఓ చిన్నలోపం గుర్తించా. లెగ్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే సచిన్.. ఆఫ్ స్పిన్ విషయంలో కాస్త బలహీనంగానే చెప్పాలి. చాలామంది ఆఫ్ స్పిన్నర్లు ఈ విషయాన్ని రుజువు చేశారు. ఆఫ్ స్పిన్లో సచిన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు కాదు' అని మురళీధరన్ అన్నాడు.
IND vs ENG: 'కేఎల్ రాహుల్ మరోసారి నిరూపించుకున్నాడు.. అతడి ముందున్న సవాల్ అదొక్కటే'

సచిన్ బలహీనత అదే
'సచిన్ నాకు కూడా చాలాసార్లు వికెట్ సమర్పించాడు. అయితే ఈ విషయాన్ని నేనెప్పుడు సచిన్ వద్ద ప్రస్తావించ లేదు. బహుశా ఆయనకు ఆఫ్ స్పిన్ ఆడటంలో కాస్త బలహీనత ఉందని నా అభిప్రాయం. ఏదేమైనా సచిన్ చాలా క్లిష్టమైన ఆటగాడు. అతడిని అవుట్ చేయడం చాలా కష్టం. అద్భుత బంతితో మాత్రమే అతడిని ఔట్ చేయగలం' అని లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తరువాత అత్యధిక సార్లు సచిన్ను అవుట్ చేసిన ఘనత మురళీధరన్దే. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 530కిపైగా మురళీధరన్ పడగొట్టిన విషయం తెలిసిందే. టెస్టుల్లో అత్యధిక వికెట్ల ఘనత మురళీధరన్ పేరుపైనే ఉంది. షేన్ వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు.

సెహ్వాగ్ అత్యంత ప్రమాదకారి
వీరేంద్ర సెహ్వాగ్, బ్రయన్ లారాకు బౌలింగ్ చేసేందుకు మాత్రం తాను భయపడేవాడినని శ్రీలంక లిజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. 'సెహ్వాగ్ అత్యంత ప్రమాదకారి. మొదటి బంతిని బడాలనుకుంటాడు. అతడి కోసం మేం డీప్లో, బౌండరీ సరిహద్దుల వద్ద ఫీల్డర్లను మోహరించేవాళ్లం.
ఎందుకంటే అతడు అవకాశాలను వదులుకోడు. తన సహజశైలి ప్రకారం బంతిని బాదేస్తాడు. తనదైన రోజున ఎవరిపైనైనా దాడిచేస్తాను అన్నట్టుగా అతడి స్వభావం ఉండేది. అందుకే మేం అతడికి డిఫెన్సివ్ ఫీల్డింగ్ పెట్టి ఎప్పుడు పొరపాటు చేస్తాడా? అని ఎదురు చూసేవాళ్లం' అని మురళీధరన్ చెప్పాడు.

రోజంతా ఆడితే
'వీరేంద్ర సెహ్వాగ్లో ఓ ప్రత్యేకత ఉంది. క్రీజులో ఉంటే వేగంగా పరుగులు చేయడానికే చూస్తాడు. ఈ క్రమంలోనే బౌలర్లను భయాందోళనకు గురిచేస్తాడు. బౌండరీలే లక్ష్యంగా ఆడుతాడు. వీరూ క్రీజులో రెండు గంటలు ఉంటే 150.. రోజంతా ఆడితే 300 పరుగులు చేసేస్తాడు. అందుకే అలాంటి ఆటగాళ్లు ఎంతో ప్రమాదకరం' అని లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుత తరంలో తన బౌలింగ్ను విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ బాగా ఎదుర్కోగలరని అతడు అంచనా వేశాడు. వారిద్దరూ స్పిన్ను బాగా ఆడతారని తెలిపాడు. కోహ్లీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని లంక మాజీ స్పిన్నర్ జోస్యం చెప్పాడు.


Click it and Unblock the Notifications












